భారత క్రికెట్లో ఐపీఎల్ అనేది కేవలం టోర్నమెంట్ మాత్రమే కాదు – మిలియన్ల మంది అభిమానుల కలల ప్రపంచం. ఈ క్రికెట్ కార్నివల్లో విజయాలు సెలబ్రేషన్గా మారుతూ ఉంటాయి. కానీ 2025 లో బెంగళూరులో జరిగిన ఆర్సీబీ విక్టరీ పరేడ్ మాత్రం చరిత్రలో శోకంగా మిగిలిపోయింది. ఈ వేడుకలో చోటు చేసుకున్న తొక్కిసలాట వల్ల పలు కుటుంబాలు తమ సన్నిహితులను కోల్పోయాయి. ఈ ఘటనలో బాధితుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్లోని (Andhra Pradesh) అన్నమయ్య జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలిక దివ్యాంశి (Divyansi) కూడా ఉండడం అందరికీ కన్నీళ్లను తెప్పించింది.
ఘటన వివరాలు
RCB 2025 టైటిల్ గెలవడంతో బెంగళూరులో (Bangalore) ఘనంగా విజయోత్సవ పరేడ్ నిర్వహించాలని నిర్ణయించారు. 18 ఏళ్ల నుంచి బెంగుళూరు రాయల్ ఛాలెంజర్స్ అభిమానులు కన్న కల నెరవేరిన క్షణం ఇప్పుడు ఎన్నో కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది. బెంగళూరులో జరిగిన విక్టరీ పరేడ్లో జరిగిన తొక్కిసలాటలో ఇప్పటికే 11 మంది మృత్యువాత పడ్డారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో ఈ వ్యవహారం దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
దివ్యాంశి వివరాలు
అన్నమయ్య జిల్లాకు చెందిన బాలిక కూడా ప్రాణాలు కోల్పోయిందని తెలుస్తోంది. చిన్నమండెం మండలం వండాడికి చెందిన దివ్యాంశి అనే 14 ఏళ్ల బాలిక తొక్కిసలాటలో చనిపోయింది. దివ్యాంశి తండ్రి శివకుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్గా పనిచేస్తున్నారు. ఆయన భార్య అశ్విని, ఇద్దరు పిల్లలతో కలిసి విక్టరీ పరేడ్ చూడడానికి స్టేడియం వద్దకు వెళ్లారు. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో దివ్యాంశి ఊపిరాడక చనిపోయిందని కుటుంబ సభ్యులు తెలిపారు. దివ్యాంశి మరణంతో వారి కుటుంబంలో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ విషాదం వారి కుటుంబాన్ని క్షణాల్లో కూల్చివేసింది. దివ్యాంశి అంత్యక్రియలు ఇవాళ నిర్వహించనున్నట్టు ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. తొక్కిసలాట జరిగిందని తెలిసినప్పటికీ విజయోత్సవ కార్యక్రమం నిర్వహించడం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ప్రభుత్వ స్పందన – విచారణ, చర్యలు
ఈ ఘటనపై స్పందించిన కర్ణాటక ప్రభుత్వం పలువురు పోలీసు అధికారులను సస్పెండ్ చేయగా.. ఆర్సీబీ ప్రతినిధులు, ఈవెంట్ నిర్వహించిన ఏజెన్సీ ప్రతినిధులను అరెస్టు చేయాలని ఆదేశించింది. అంతే కాకుండా తొక్కిసలాటకు గల కారణాలపై విచారణకు రిటైర్డ్ హైకోర్టు జడ్జి నేతృత్వంలో ఏకసభ్య కమిషన్ ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కర్ణాటక హైకోర్టు ఈ ఘటనపై తీవ్రంగా స్పందించింది. జనాల ప్రాణాలు పోయినా, అధికారులు నిర్లక్ష్యం చూపిన తీరు అసహ్యకరమని పేర్కొంది. విచారణ నివేదికను వచ్చే మంగళవారం లోగా కోర్టులో సమర్పించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.
Read also: Bangalore: బెంగళూరు ఘటనలో తమిళనాడు కరస్పాండెంట్ మృతి
Pawan Kalyan : బక్రీద్ వేళ గో సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పవన్ కల్యాణ్ సూచన