టీమిండియా ఫైనల్కు దూరమైన కివీస్ పేసర్.. కారణం ఏంటంటే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ పోరుకు భారత జట్టు, న్యూజిలాండ్ జట్టు సిద్ధమైంది. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరుగుతున్న ఈ హైవోల్టేజ్ మ్యాచ్లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ ఎంచుకుంది. అయితే, మ్యాచ్ ప్రారంభానికి ముందే కివీస్కు ఊహించని ఎదురుదెబ్బ తగిలింది.

న్యూజిలాండ్కు షాక్.. గాయంతో మాట్ హెన్రీ దూరం
న్యూజిలాండ్ ప్రధాన పేసర్ మాట్ హెన్రీ గాయం కారణంగా ఫైనల్కు అందుబాటులో లేడు. దక్షిణాఫ్రికాతో జరిగిన సెమీఫైనల్లో ఫీల్డింగ్ చేస్తుండగా అతనికి భుజానికి తీవ్ర గాయమైంది. క్యాచ్ తీసుకునే ప్రయత్నంలో భుజానికి బలమైన దెబ్బ తగలడంతో హెన్రీ ఆటకు దూరమయ్యాడు. అతని స్థానంలో యువ పేసర్ నాథన్ స్మిత్ను తుది జట్టులోకి చేర్చారు.హెన్రీ గాయం కివీస్ బౌలింగ్ దళానికి పెద్ద లోటుగానే మారింది. 50 ఓవర్ల ఫార్మాట్లో న్యూజిలాండ్ టైటిల్ ఆశలకు అతను కీలక బౌలర్. గ్రూప్ దశలో భారత్తో జరిగిన మ్యాచ్లో హెన్రీ 42 పరుగులకే ఐదు వికెట్లు పడగొట్టి మెరుగైన ప్రదర్శన కనబరిచాడు. టోర్నమెంట్లో ఇప్పటివరకు అతను అత్యధిక వికెట్లు (10) తీసిన బౌలర్గా ఉన్నాడు.
భారత జట్టులో మార్పుల్లేవు
ఇదే సమయంలో టీమిండియా తన గెలుపు జోరు కొనసాగించేందుకు తుది జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు. కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ అనంతరం మాట్లాడుతూ, తాము టాస్ను పెద్దగా భావించబోమని, ముందుగా బ్యాటింగ్ చేయడం, బౌలింగ్ చేయడం రెండూ సమానమేనని పేర్కొన్నాడు. మైదానంలో తమ ప్రదర్శనకే ప్రధాన ప్రాధాన్యం ఇస్తామని, విజయం కోసం తమ స్ట్రాటజీని అమలు చేస్తామని స్పష్టం చేశాడు. ఈ మ్యాచ్పై క్రీడాభిమానులు అత్యంత ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు. రెండు జట్లు శక్తివంచన లేకుండా తలపడనున్న ఈ ఫైనల్లో ఎవరు విజేతగా నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది.