ICC టీ20 ప్రపంచకప్ 2026 (T20 World Cup) లో ఇటలీ జట్టు సంచలనం సృష్టించింది. టోర్నీలో తమ తొలి విజయాన్నినమోదు చేసింది. గురువారం ముంబైలోని వాంఖడే స్టేడియంలో జరిగిన మ్యాచ్లో, ఇటలీ ఏకంగా 10 వికెట్ల తేడాతో నేపాల్ను చిత్తుగా ఓడించింది. సోదరులైన ఓపెనర్లు జస్టిన్ మొస్కా, ఆంథోనీ మొస్కా విధ్వంసక బ్యాటింగ్తో చెలరేగి, ఒక్క వికెట్ కూడా పడకుండా తమ జట్టును గెలిపించారు. ఈ టోర్నీ చరిత్రలోనే ఇటలీకి ఇది తొలి విజయం కావడం విశేషం.
Read Also: T20 World Cup: భారత్ తో మ్యాచ్.. టాస్ గెలిచిన నమీబియా
12.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు
నేపాల్ నిర్దేశించిన 124 పరుగుల స్వల్ప లక్ష్య ఛేదనలో, ఇటలీ ఓపెనర్లు ఆరంభం నుంచే ఎదురుదాడికి దిగారు. గత మ్యాచ్లో ఇంగ్లండ్కు గట్టిపోటీ ఇచ్చిన నేపాల్ బౌలర్లకు వారు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదు. పవర్ప్లే ముగిసేసరికి ఇటలీ వికెట్ నష్టపోకుండా 68 పరుగులు చేసి తన ఉద్దేశాన్ని స్పష్టం చేసింది. ముఖ్యంగా జస్టిన్ మొస్కా 44 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్సర్లతో 60 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్లో అతని సోదరుడు ఆంథోనీ మొస్కా మరింత దూకుడుగా ఆడి కేవలం 32 బంతుల్లో 3 ఫోర్లు, 6 భారీ సిక్సర్లతో 62 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ కలిసి 12.4 ఓవర్లలోనే మ్యాచ్ను ముగించారు.
ఈ క్రమంలో ఈ సోదరులు ఓ అరుదైన రికార్డును కూడా తమ ఖాతాలో వేసుకున్నారు. టీ20 ప్రపంచకప్లో తోబుట్టువులు నెలకొల్పిన అత్యధిక భాగస్వామ్యం (124*) రికార్డును సృష్టించారు. గతంలో 2014లో పాకిస్థాన్కు చెందిన కమ్రాన్ అక్మల్, ఉమర్ అక్మల్ నెలకొల్పిన 96 పరుగుల భాగస్వామ్యాన్ని వీరు అధిగమించారు.అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన నేపాల్, ఇటలీ బౌలర్ల ధాటికి 19.3 ఓవర్లలో 123 పరుగులకే కుప్పకూలింది. ఇటలీ బౌలర్ క్రిషన్ కలుగామగే (3/18) కీలక వికెట్లు పడగొట్టి నేపాల్ పతనాన్ని శాసించాడు. నేపాల్ జట్టులో ఆసిఫ్ షేక్ (26), కెప్టెన్ రోహిత్ పౌడెల్ (23) మాత్రమే కాస్త రాణించారు. ఒక దశలో 98 పరుగులకు 5 వికెట్లతో ఉన్న నేపాల్, చివరి 25 పరుగులకే మిగిలిన 5 వికెట్లను కోల్పోయి తక్కువ స్కోరుకే పరిమితమైంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: