IPL ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 సీజన్ ఎంతో రసవత్తరంగా సాగుతోంది. ఈ సీజన్లో చాలామంది ఆటగాళ్లు చివరి ఓవర్ల వరకు పోరాడుతూ మ్యాచ్ ఫలితాన్ని ఊహించలేని స్థాయికి తీసుకెళ్లారు. కొన్ని మ్యాచ్లలో ఒక్కో నిమిషంలో మ్యాచ్ స్వరూపం మారిపోయింది. కారణం – టీమ్ల్లో ఉన్న శక్తివంతమైన హిట్టర్లు. అయితే, ఈ హడావిడిలో కొంతమంది ఆటగాళ్లు స్థిరంగా పరుగులు చేస్తూ తమ జట్ల విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నారు.అటువంటి స్థిరత చూపిన బ్యాట్స్మెన్కి ప్రతి సీజన్లో ఆరెంజ్ క్యాప్ అవార్డు లభిస్తుంది. అత్యధిక పరుగులు చేసిన ఆటగాడు ఈ అవార్డుకు అర్హత పొందుతాడు. అయితే, వరుసగా రెండు సీజన్లలో ఆరెంజ్ క్యాప్ గెలుచుకోవడం సాధారణ విషయం కాదని చెప్పాలి. ఐపీఎల్ చరిత్రలో ఈ అరుదైన ఘనత దక్కించుకున్న ఏకైక ఆటగాడు వెస్టిండీస్కి చెందిన క్రిస్ గేల్. 2011, 2012 సీజన్లలో వరుసగా రెండు సార్లు గేల్ ఆరెంజ్ క్యాప్ విజేతగా నిలిచాడు. 2011లో ఆర్సీబీ తరఫున 608 పరుగులు చేసి, తన జట్టును ఫైనల్కి తీసుకెళ్లాడు. అయితే, ఆ ఫైనల్లో చెన్నై చేతిలో ఓటమి చవిచూసింది. 2012లో కూడా గేల్ 733 పరుగులు చేసి సూపర్ ఫామ్లో ఉన్నా, బెంగళూరు జట్టు ప్లేఆఫ్స్కి కూడా చేరలేదు.ఐపీఎల్ ప్రారంభమైన 2008లో మొదటి ఆరెంజ్ క్యాప్ విజేత ఆస్ట్రేలియాకు చెందిన షాన్ మార్ష్. అతను కింగ్స్ ఎలెవన్ పంజాబ్ తరఫున ఆడుతూ 616 పరుగులు చేశాడు. ఇక 2016 సీజన్లో విరాట్ కోహ్లీ బెంగళూరు తరఫున 973 పరుగులు చేసి, ఇప్పటివరకు ఒకే సీజన్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా రికార్డు నెలకొల్పాడు. అందులో నాలుగు సెంచరీలు ఉండడం విశేషం. 2024లో కూడా కోహ్లీ అద్భుత ప్రదర్శన చూపిస్తూ 741 పరుగులతో ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్నాడు.
ఇంకా చెప్పాలంటే, ఆస్ట్రేలియా బ్యాట్స్మన్ డేవిడ్ వార్నర్ అత్యధిక సార్లు ఆరెంజ్ క్యాప్ గెలుచుకున్న ఆటగాడు. 2015, 2017, 2019లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున అతను అద్భుతమైన ప్రదర్శనతో ముందంజలో నిలిచాడు. అంతేకాకుండా, ఒకే సీజన్లో ఆరెంజ్ క్యాప్ మరియు ఐపీఎల్ ట్రోఫీని గెలుచుకున్న అరుదైన ఆటగాళ్లు ఇద్దరే – 2014లో రాబిన్ ఉతప్ప (కోల్కతా నైట్ రైడర్స్), 2021లో రుతురాజ్ గైక్వాడ్ (చెన్నై సూపర్ కింగ్స్).ఈ రికార్డులు, ఫార్ములు చూస్తుంటే – ఈ సీజన్ ఆరెంజ్ క్యాప్ కోసం పోటీ ఎలా ఉంటుందో ఊహించలేము. మరి ఈసారి ఆ గౌరవం ఎవరికి దక్కుతుందో చూడాలి!
Read more :
Prithviraj Sukumaran: తన కొత్త సినిమాను ప్రకటించిన పృథ్వీరాజ్ సుకుమారన్