Latest News: IND vs PAK – అతనే మా విజయానికి కారణం: సూర్యకుమార్ యాదవ్

Read Time:  1 min
IND vs PAK
IND vs PAK
FONT SIZE
GET APP

ఆసియా కప్ 2025 (2025 Asia Cup)లో టీమిండియా సూపర్–4 పోరులో మరో అద్భుత విజయం సాధించింది. ఆదివారం జరిగిన భారత్–పాకిస్థాన్ మ్యాచ్‌లో భారత జట్టు ఆగ్రెసివ్ ఆటతో ప్రదర్శన ఇచ్చి 6 వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను చిత్తు చేసింది. ఈ విజయంలో ప్రధాన పాత్ర పోషించిన ఆటగాళ్లలో ఒకరు పేస్ ఆల్‌రౌండర్ శివమ్ దూబే (Shivam Dubey). మ్యాచ్ అనంతరం టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ (Suryakumar Yadav) మీడియాతో మాట్లాడుతూ శివమ్ ప్రదర్శనపై తన ప్రశంసలు కురిపించాడు.

పాకిస్థాన్ భారీ స్కోర్‌కు శివమ్ దూబేనే అడ్డుకట్ట వేసాడని కొనియాడాడు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనని, వారిది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్ అని ప్రశంసించాడు. తమ ఆటగాళ్లపై ప్రశంసల జల్లు కురిపించాడు. ఈ మ్యాచ్‌లో క్యాచ్‌లు వదిలేసిన ఆటగాళ్లందరికీ తమ ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ (T Dileep) ఈమెయిల్ పంపించారని చెప్పాడు. ‘ప్రతీ మ్యాచ్‌లోనూ మా ఆటగాళ్లు అద్భుతంగా రాణిస్తున్నారు.

కుర్రాళ్లు గొప్ప ఆత్మవిశ్వాసం కనబర్చారు

దాంతో కెప్టెన్‌గా నా పని సులువు అవుతుంది. కుర్రాళ్లు గొప్ప ఆత్మవిశ్వాసం కనబర్చారు. మా బౌలింగ్‌ సమయంలో తొలి 10 ఓవర్ల తర్వాత కూడా ప్రశాంతంగా ఉన్నారు. డ్రింక్స్ బ్రేక్ తర్వాత.. ఇప్పుడే ఆట మొదలైందని మా వాళ్లతో చెప్పాను.బుమ్రా (Bumrah) వైఫల్యం గురించి ఆందోళన చెందాల్సిన పనిలేదు. అతనేం రోబో కాదు. అతనికి కూడా చెడు రోజులు ఉంటాయి. బౌలింగ్‌లో క్లిష్ట పరిస్థితుల నుంచి శివమ్ దూబే మమ్మల్ని గట్టెక్కించాడు.

IND vs PAK
IND vs PAK

అభిషేక్ శర్మ, శుభ్‌మన్ గిల్ మధ్య మంచి బాండింగ్ ఉంది. ఒకరికొకరు బాగా సహకరించుకుంటారు. వారిది ఫైర్ అండ్ ఐస్ కాంబినేషన్. తొలి ఇన్నింగ్స్ అనంతరం క్యాచ్‌లు వదిలేసిన ఆటగాళ్లకు మా ఫీల్డింగ్ కోచ్ టీ దిలీప్ ఈమెయిల్ చేశారు.’అని సూర్యకుమార్ యాదవ్ చెప్పుకొచ్చాడు.ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 171 పరుగులు చేసింది.

నాలుగు క్యాచ్‌లు వదిలేయడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది

సహిబ్జాద ఫర్హాన్(45 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 58) హాఫ్ సెంచరీతో రాణించగా.. ఫహీమ్ అష్రఫ్(8 బంతుల్లో ఫోర్, 2 సిక్స్‌లతో 20 నాటౌట్) దూకుడుగా ఆడాడు. భారత బౌలర్లలో శివమ్ దూబే(2/33) రెండు వికెట్లు తీయగా.. హార్దిక్ పాండ్యా, కుల్దీప్ యాదవ్ చెరొక వికెట్ పడగొట్టారు. టీమిండియా ఫీల్డర్లు నాలుగు క్యాచ్‌లు వదిలేయడం పాకిస్థాన్‌కు కలిసొచ్చింది. లేకుంటే ఆ జట్టు తక్కువ స్కోర్‌కే పరిమితమయ్యేది.అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 174 పరుగులు చేసి 7 బంతులు మిగిలి ఉండగానే గెలుపొందింది.

అభిషేక్ శర్మ(39 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్‌లతో 74) హాఫ్ సెంచరీకి తోడుగా..శుభ్‌మన్ గిల్(28 బంతుల్లో 8 ఫోర్లతో 47), తిలక్ వర్మ(19 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 30 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పాకిస్థాన్ బౌలర్లలో హారిస్ రౌఫ్(2/26) రెండు వికెట్లు తీయగా.. అబ్రర్ అహ్మద్, ఫహీమ్ అష్రఫ్ తలో వికెట్ తీసారు. ఈ మ్యాచ్‌లో కూడా పాకిస్థాన్ ఆటగాళ్లకు భారత్ ప్లేయర్లు షేక్ హ్యాండ్ ఇవ్వలేదు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ind-vs-pak-i-want-to-win-for-the-team-abhishek-sharma/international/551661/

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.