న్యూజిలాండ్తో ఐదు టీ20ల సిరీస్లో టీమిండియా విజేతగా నిలిచింది. మరో రెండు మ్యాచ్లు మిగిలి ఉండగానే 3-0తో సిరీస్ కైవసం చేసుకుంది. ఆదివారం గౌహతి వేదికగా జరిగిన మూడో టీ20లో సమష్టిగా రాణించిన టీమిండియా 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. తొలుత బౌలింగ్లో అదరగొట్టి కివీస్ను 153 పరుగులకే కట్టడి చేసిన భారత్, అనంతరం అభిషేక్ శర్మ, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ విధ్వంసక హాఫ్ సెంచరీలతో కేవలం 10 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది.
Read Also: IND Vs NZ 3rd T20: టాస్ గెలిచిన భారత్
154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్కు తొలి బంతికే షాక్ తగిలింది. ఓపెనర్ సంజూ శాంసన్ (0) డకౌట్గా వెనుదిరిగాడు. అయితే ఈ దశలో క్రీజులోకి వచ్చిన ఇషాన్ కిషన్ (13 బంతుల్లో 28), మరో ఓపెనర్ అభిషేక్ శర్మతో కలిసి ఎదురుదాడికి దిగాడు. వీరిద్దరూ కేవలం 19 బంతుల్లోనే 53 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఇషాన్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, అభిషేక్తో కలిసి విధ్వంసం సృష్టించాడు. తన పరుగుల దాహాన్ని తీర్చుకుంటూ కివీస్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు.
సూర్య 26 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 57 పరుగులతో నాటౌట్గా నిలిచి జట్టును విజయతీరాలకు చేర్చాడు. అభిషేక్ శర్మ కూడా కేవలం 20 బంతుల్లోనే 7 ఫోర్లు, 5 సిక్సర్లతో 68 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. వీరిద్దరూ మూడో వికెట్కు అజేయంగా 40 బంతుల్లోనే 102 పరుగులు జోడించడం విశేషం. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్, కివీస్ను ఆది నుంచే దెబ్బతీసింది. భారత బౌలర్ల ధాటికి న్యూజిలాండ్ 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.
9 వికెట్ల నష్టానికి 153 పరుగులు
ఈ దశలో గ్లెన్ ఫిలిప్స్ (40 బంతుల్లో 48), మార్క్ చాప్మన్ (23 బంతుల్లో 32) నాలుగో వికెట్కు 52 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు. అయితే ఈ భాగస్వామ్యాన్ని రవి బిష్ణోయ్ విడదీయడంతో కివీస్ మళ్లీ కుప్పకూలింది. చివర్లో కెప్టెన్ మిచెల్ శాంట్నర్ (17 బంతుల్లో 27) కాస్త రాణించడంతో న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది.
భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 17 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. రవి బిష్ణోయ్, హార్దిక్ పాండ్యా చెరో రెండు వికెట్లు తీసి కివీస్ పతనాన్ని శాసించారు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తి ఆధిపత్యం ప్రదర్శించిన టీమిండియా, సిరీస్ను కైవసం చేసుకుంది. నామమాత్రంగా మిగిలిన చివరి రెండు మ్యాచ్లలో బెంచ్ బలాన్ని పరీక్షించే అవకాశం ఉంది.
సంక్షిప్త స్కోర్లు
న్యూజిలాండ్: 20 ఓవర్లలో 153/9 (ఫిలిప్స్ 48, చాప్మన్ 32, బుమ్రా 3/17, బిష్ణోయ్ 2/18);
భారత్: 10 ఓవర్లలో 155/2 (అభిషేక్ 68*, సూర్య 57*, హెన్రీ 1/28, సోధి 1/28)
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: