భారత క్రికెట్ అభిమానులకు ‘కెప్టెన్ కూల్’ (‘Captain Cool’) అనే పేరు వినగానే గుర్తొచ్చేది ఒక్కరు – మహేంద్ర సింగ్ ధోనీ MS Dhoni . ఒత్తిడిలోనూ చల్లబడిన ధోరణితో జట్టును ముందుండి నడిపిస్తూ, ఎన్నో విజయాలు అందించిన ఆయన ఇప్పుడు అదే బిరుదును అధికారికంగా తన సొంతం చేసుకోవాలనుకుంటున్నారు.జూన్ 5న ధోనీ ‘కెప్టెన్ కూల్’ పేరును ట్రేడ్మార్క్ చేసేందుకు అధికారికంగా దరఖాస్తు చేశారు. ట్రేడ్మార్క్స్ రిజిస్ట్రీ పోర్టల్ ప్రకారం, ఈ దరఖాస్తును జూన్ 16న అధికారిక జర్నల్లో ప్రచురించారు. ప్రస్తుతం ఈ దరఖాస్తు “ఆమోదించబడింది మరియు ప్రచారం చేయబడింది” అనే దశలో ఉంది.ఈ పేరు క్రీడా శిక్షణ, కోచింగ్ సదుపాయాల రంగంలో ఉపయోగించేందుకు ధోనీ జట్టు ఆలోచిస్తోంది. అయితే ధోనీ బృందం నుంచి దీనిపై ఇంకా స్పందన రాలేదు.
మరో సంస్థ దరఖాస్తు చేసిన వివరాలు
ధోనీ ముందు ‘కెప్టెన్ కూల్’ పేరిట ప్రభా స్కిల్ స్పోర్ట్స్ (ఓపీసీ) ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థ కూడా ట్రేడ్మార్క్ కోసం దరఖాస్తు చేసింది. కానీ ఆ దరఖాస్తు స్టేటస్ ప్రస్తుతం ‘Rectification Filed’ దశలో ఉంది. దీంతో ధోనీ దరఖాస్తు లీడ్లో ఉండే అవకాశాలున్నాయి.ఇదే సమయంలో మరో గౌరవం ధోనీని పలకరించింది. 2025 సంవత్సరానికి గాను ఆయనను ఐసీసీ క్రికెట్ హాల్ ఆఫ్ ఫేమ్లో చేర్చారు. ఆయనతో పాటు ఆసీస్ బ్యాట్స్మన్ మాథ్యూ హేడెన్, సఫారీ దిగ్గజం హషీమ్ ఆమ్లా సహా మొత్తం తొమ్మిది మంది ఈ గౌరవాన్ని పొందారు.
ఐసీసీ ప్రశంసల వర్షం
ఈ సందర్భంగా ఐసీసీ ధోనీపై ప్రశంసల వర్షం కురిపించింది. “ధోనీ గణాంకాలతో పాటు నిలకడ, ఫిట్నెస్, వ్యూహాత్మక నైపుణ్యంలో గొప్పగా నిలిచారు. ఒత్తిడిలోనూ శాంతంగా ఉండే ధోరణి, ఫినిషింగ్ సామర్థ్యం, నాయకత్వ నైపుణ్యం ఆయనను ప్రత్యేకంగా నిలబెట్టాయి” అంటూ ఐసీసీ పేర్కొంది.ఓ వైపు ట్రేడ్మార్క్ కోసం అడుగులు వేస్తూ, మరోవైపు ప్రపంచ క్రికెట్ నుంచి గౌరవాలు అందుకుంటూ ధోనీ తన ప్రభావాన్ని నిరూపిస్తున్నాడు. ‘కెప్టెన్ కూల్’ అనే పేరు ఇక అధికారికంగా ధోనీదేనని చెప్పే రోజూ దూరం కాదు.
Read Also : IND vs ENG: షాహిద్ అఫ్రిది ప్రపంచ రికార్డును బద్దలు కొట్టే దిశగా జైస్వాల్