బాలీవుడ్ నటి ఈషా గుప్తా (Esha Gupta) ఇటీవల ప్రముఖ యాంకర్ సిద్ధార్థ్ కన్నన్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి ముఖ్యమైన విషయాలు బయటపెట్టారు. ముఖ్యంగా భారత క్రికెట్ ఆటగాడు హార్దిక్ పాండ్యా (Hardik Pandya) తో తాను ప్రేమలో ఉన్నట్టుగా గతంలో వచ్చిన పుకార్లకు చెక్ పెట్టారు. గత కొంతకాలంగా వారి మధ్య ప్రేమ సంబంధం ఉందన్న వార్తలు సోషల్ మీడియా మరియు పత్రికలలో చక్కర్లు కొడుతుండగా, ఈషా వ్యాఖ్యలు ఇప్పుడు అందుకు సమాధానంగా నిలిచాయి.

“మేము డేటింగ్ చెయ్యలేదు” – ఈషా స్పష్టం
ఈషా మాట్లాడుతూ, హార్దిక్ పాండ్యాతో తనకున్న సంబంధం గురించి ఈషా మాట్లాడుతూ, “అవును, కొంతకాలం మేమిద్దరం మాట్లాడుకున్నాం. కానీ మేం డేటింగ్ చేస్తున్నామని నేను అనుకోవడం లేదు. కొన్ని నెలల పాటు మా మధ్య సంభాషణలు జరిగాయి. బహుశా ఇది జరుగుతుందేమో, జరగదేమో అన్న దశలో ఉండేవాళ్లం. మేం డేటింగ్ దశకు చేరుకోకముందే అది ముగిసిపోయింది. కాబట్టి దాన్ని డేటింగ్ అని చెప్పలేం. ఒకట్రెండు సార్లు కలిశాం, అంతే. నేను చెప్పినట్లుగా, కొన్ని నెలల పాటు మాట్లాడుకున్నాం, ఆ తర్వాత అది ఆగిపోయింది” అని వివరించారు.
అనుకూల పరిస్థితులు లేవు – కానీ గొడవలు కూడా లేవు
నిజంగానే వారిద్దరి మధ్య సంబంధం ఏర్పడే అవకాశం ఉండిందా అని అడిగిన ప్రశ్నకు ఈషా సూటిగా సమాధానమిచ్చారు. “బహుశా జరిగి ఉండేదేమో” అని చెబుతూనే, అనుకున్నంత వేగంగా విషయాలు ముందుకు సాగలేదని తెలిపారు. సమయం, అనుకూలత సరిగ్గా కుదరలేదని ఆమె పంచుకున్నారు. “మా మధ్య ఎలాంటి గొడవలు లేవు, మనస్పర్థలు కూడా రాలేదు. అది జరగాలని రాసిపెట్టి లేదు అంతే” అని ఆమె ప్రశాంతంగా వెల్లడించారు.
‘కాఫీ విత్ కరణ్’ వివాదం తనపై ప్రభావం చూపలేదట
హార్దిక్ పాండ్యా ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమైన సంగతి తెలిసిందే. ఆ సమయంలో ఈషా, హార్దిక్తో టచ్లో లేకపోవడం వల్ల ఆ వివాదం తనను పెద్దగా ప్రభావితం చేయలేదని స్పష్టం చేశారు. అయితే, 2019లో ఆ ఎపిసోడ్ ప్రసారమైనప్పుడు, అందులోని మహిళా వ్యతిరేక ధోరణిని బహిరంగంగా విమర్శించిన కొద్దిమంది సెలబ్రిటీలలో ఈషా గుప్తా కూడా ఒకరు కావడం గమనార్హం.
ఈషా గుప్తా సినీ ప్రయాణం
ఈషా గుప్తా చివరిసారిగా బాబీ డియోల్ ప్రధాన పాత్రలో వచ్చిన వెబ్ సిరీస్ ‘ఏక్ బద్నామ్ ఆశ్రమ్ 3 పార్ట్ 2’లో కనిపించారు. అలాగే ‘వన్ డే: జస్టిస్ డెలివర్డ్’ చిత్రంలో డీసీపీ లక్ష్మీ రాఠీ పాత్రలో నటించారు. ప్రస్తుతం ఆమె ‘హేరా ఫేరీ 3’ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.