DK Shivakumar: బెంగ‌ళూరు ఘటనపై కన్నీరు పెట్టుకున్న డీకే శివకుమార్

Read Time:  1 min
DK Shivakumar speech
DK Shivakumar speech
FONT SIZE
GET APP

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) ఐపీఎల్ చరిత్రలో తొలిసారి టైటిల్ గెలిచిన నేపథ్యంలో నిర్వహించిన విజయోత్సవ సభ ఒక పెను విషాదంగా మిగిలింది. చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన దేశవ్యాప్తంగా దిగ్భ్రాంతిని కలిగించింది. ఈ సంఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 47 మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు.

ఈ సంఘటనపై స్పందించిన కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మీడియా సమావేశంలో కన్నీటి పర్యంతమయ్యారు. “ఆ చిన్నారుల గురించి నాకు చాలా ఆందోళనగా ఉంది. వాళ్లు 15 ఏళ్ల వయసు వాళ్లు కనీసం 10 మంది చనిపోవడం నా కళ్లారా చూశాను. ఈ నష్టాన్ని ఏ కుటుంబం తట్టుకోలేదు” అని వేదనతో చెప్పారు. పోలీసుల సూచనతో కార్యక్రమాన్ని వేగంగా ముగించామని, అప్పటికే ప్రమాదం జరగడం ప్రారంభమైందని వివరించారు.

ప్రభుత్వ స్పందన – హామీలు, విచారణలు

ఘటన జరిగిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించింది. గాయపడిన వారికి ఉచితంగా మెరుగైన వైద్యం అందిస్తామని హామీ ఇచ్చింది. సీఎం సిద్ధరామయ్య ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. “ఇలాంటి విషాదం జరిగి ఉండాల్సింది కాదు. ఈ ఘటనపై ప్రభుత్వం తీవ్ర విచారాన్ని వ్యక్తం చేస్తోంది” అని ఆయన అన్నారు. స్టేడియం సామర్థ్యం కేవలం 35వేలు కాగా, సంబరాల కోసం సుమారు 2 నుంచి 3 లక్షల మంది ప్రజలు గుమిగూడారని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని మెజిస్టీరియల్ విచారణకు ఆదేశించారు.

రాజకీయ విమర్శలు – రాజీనామా డిమాండ్లు

ఈ ఘటనపై రాజకీయాలు కూడా వేడెక్కాయి. కేంద్ర మంత్రి హెచ్‌డీ కుమారస్వామి మాట్లాడుతూ… డీకే శివకుమార్ అపరిపక్వత, బాధ్యతారాహిత్య ప్రవర్తన వల్లే ఈ విషాదం జరిగిందని ఆరోపించారు. ఆయన తక్షణమే డిప్యూటీ సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

న్యాయపరమైన చర్యల దిశగా సామాజిక ఒత్తిడి

మరోవైపు, సామాజిక కార్యకర్త స్నేహమయి కృష్ణ, సీఎం సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ మరియు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపిస్తూ, వారిపై ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్ 106 కింద పోలీసులకు ఫిర్యాదు చేశారు.

సంపూర్ణ వైఫల్యమే దుర్ఘటనకు మూలం

ప్రాథమికంగా వెలువడిన నివేదికల ప్రకారం, స్టేడియంలోని గేట్ నెం.7 వద్ద ఈ తొక్కిసలాట చోటుచేసుకుంది. ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ విజయాన్ని పురస్కరించుకుని నగరం మొత్తం జరుపుకోవాల్సిన వేడుక కాస్తా, సరైన ప్రణాళిక లేకపోవడం, అస్పష్టమైన సమాచారం, నియంత్రణ చర్యలు విఫలం కావడం వల్ల విషాదంగా మారిందని తెలుస్తోంది. ఈ ఘటనను కర్ణాటక హైకోర్టు సుమోటోగా స్వీకరించి, విచారణకు తేదీని ఖరారు చేసింది. ఈ దుర్ఘటనకు గల పూర్తి కారణాలు విచారణ అనంతరం వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. ఈ విషాదంపై సెలబ్రిటీలు, సామాజిక నాయకులు, ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. అనుష్క శర్మ, కమల్ హాసన్, సోనూసూద్, ఆర్. మాధవన్, శివరాజ్ కుమార్ వంటి వారు తమ భావోద్వేగాలను పంచుకున్నారు.

Read also: Bangalore: బెంగళూరు ఘటన కలిచివేసిందన్న అనుష్క శర్మ, కమల్ హాసన్

Sharanya

రచయిత గురించి

Sharanya

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.