18 ఏళ్ల తీపి కలను నిజం చేసుకున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) జట్టు అభిమానులకు తమ ప్రియమైన జట్టు ఐపీఎల్ ట్రోఫీని గెలవడం అత్యంత సంతోషాన్ని కలిగించిన సంఘటన. కానీ, ఆ ఆనందం ఎక్కువసేపు నిలవలేదు. జూన్ 4వ తేదీ సాయంత్రం బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద నిర్వహించిన విజయోత్సవ సభ భయానక మార్పుకు దారి తీసింది. అభిమానుల గుంపులు నియంత్రణ కోల్పోవడంతో తొక్కిసలాట జరిగింది.
ఈ ఘటనలో ఇప్పటివరకు 11 మంది మరణించగా, 45 మందికి పైగా గాయాలు అయ్యాయి. మరికొందరి పరిస్థితి విషమంగా ఉండడంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశముంది.
అనుమతుల విషయంలో స్పష్టతలేమి
ఈ ఘటనతో సంబరాలు కాస్త విషాదంగా మారాయి. ప్రస్తుతం ఈ దుర్ఘటనకు బాధ్యులెవరనే దానిపై తీవ్రస్థాయిలో ఆరోపణలు, ప్రత్యారోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో తాజాగా కీలక విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనకు ముందుగా అనుమతులు తీసుకోలేదని ప్రభుత్వం తెలిపినా, చివరి నిమిషంలో ప్లాన్ చేశారని, అభిమానుల రాకను తక్కువగా అంచనా వేశామని కర్ణాటక ప్రభుత్వం తొలుత పేర్కొంది. అయితే, జూన్ 3వ తేదీన రాసిన ఒక లేఖ ప్రభుత్వ వాదనను తోసిపుచ్చుతోంది. ఓ ప్రముఖ వార్తా సంస్థకు లభించిన ఈ లేఖ ప్రకారం, ఆర్సీబీ ఐపీఎల్ గెలిస్తే విధానసౌధ వద్ద సన్మాన కార్యక్రమం నిర్వహించేందుకు కర్ణాటక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (కేఎస్సీఏ) ముందస్తుగానే అనుమతి కోరినట్లు తెలుస్తోంది. పంజాబ్ కింగ్స్తో మంగళవారం జరిగిన ఫైనల్లో ఆర్సీబీ విజయం సాధించిన విషయం తెలిసిందే.
పోలీసుల హెచ్చరికల్ని పట్టించుకోనందుకే దుర్గటన?
పోలీసులు ఈ కార్యక్రమాన్ని ఆదివారానికి వాయిదా వేసేందుకు సలహా ఇచ్చినప్పటికీ RCB యాజమాన్యం ఆదివారం నాటికి అభిమానుల భావోద్వేగాలు తగ్గుముఖం పడతాయని పోలీసులు భావించారు. అయితే, ఆదివారం నాటికి విదేశీ ఆటగాళ్లు తమ దేశాలకు వెళ్లిపోతారని, సన్మాన కార్యక్రమానికి హాజరు కాలేరని ఫ్రాంచైజీ వాదించినట్లు తెలుస్తోంది. “ఆటగాళ్లు, ముఖ్యంగా విదేశీ ప్లేయర్లు రెండు రోజుల్లో వెళ్లిపోతారనేది వారి వాదన” అని ఒక పోలీసు అధికారి తెలిపారు.
పోలీసుల విఫలం – భద్రతపై నిర్లక్ష్యం
సుమారు 2 లక్షల మంది అభిమానులు చిన్నస్వామి స్టేడియం వద్దకు తరలివచ్చారు. కానీ, దీనికి సరిపడా సెక్యూరిటీ ఏర్పాట్లు జరగకపోవడం, క్యూలైన్లు లేకపోవడం, వాహనాల రాకపోకల ఆపదలపై ముందు జాగ్రత్త చర్యలు చేపట్టకపోవడం వంటి కారణాల వల్ల తొక్కిసలాట చోటు చేసుకుంది. భారీగా తరలివచ్చిన అభిమానులను నియంత్రించడంలో పోలీసులు విఫలమయ్యారని, ఫలితంగా జరిగిన గందరగోళంలో 11 మంది మృతి చెందగా, 45 మందికి పైగా గాయపడ్డారని సమాచారం.
Read also: Bangalore: సెలబ్రేషన్స్ బుధవారం వద్దన్న పోలీసులు..నిరాకరించిన ఆర్సీబీ..