BCCI: ఫాస్ట్ బౌలర్లకు అనుకూలంగా బీసీసీఐ కీలక నిర్ణయం క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 18వ సీజన్ మరికొన్ని రోజుల్లో ప్రారంభం కానుంది. మార్చి 22 నుంచి ఈ మెగా ఈవెంట్ అభిమానులను అలరించేందుకు సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ ఐపీఎల్లో అమలవుతున్న ఓ ముఖ్యమైన నిబంధనపై కీలక నిర్ణయం తీసుకుంది.కరోనా మహమ్మారి సమయంలో, ఆటగాళ్ల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని బంతిపై ఉమ్మిని రుద్దడం (సలైవా యూజ్) చేయడంపై అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) నిషేధం విధించింది. ఈ నిషేధం ఐపీఎల్లో కూడా కొనసాగింది.

అయితే ఇప్పుడు బీసీసీఐ ఈ పరిమితిని తొలగిస్తూ, ఇకపై బౌలర్లు బంతిపై ఉమ్మిని రుద్దుకోవచ్చని అధికారికంగా ప్రకటించింది.ఈ నిర్ణయం ముఖ్యంగా పేస్ బౌలర్లకు పెద్ద ఊరటను కలిగించనుంది.ఉమ్మిని ఉపయోగించడం ద్వారా బంతికి మెరుగైన స్వింగ్ లభించటమే కాకుండా, రివర్స్ స్వింగ్ అందుకోవడానికి కూడా ఇది సహాయపడుతుంది.నేడు ముంబయిలో ఐపీఎల్కు సంబంధించిన 10 జట్ల కెప్టెన్లు సమావేశమయ్యారు. ఈ చర్చల్లో ఎక్కువ మంది కెప్టెన్లు బంతిపై ఉమ్మిని రుద్దే నిషేధాన్ని తొలగించాలని బీసీసీఐకి సూచించారు. ఈ మేరకు బీసీసీఐ సైతం తక్షణమే నిర్ణయం తీసుకుని, ఈ సీజన్ నుంచి ఈ నిబంధనను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.క్రికెట్లో బంతిని ఒకవైపు మాత్రమే రుద్దడం ద్వారా ఆ వైపు మెరుగు (షైన్) పెరుగుతుంది. ఇది స్వింగింగ్కు దోహదపడుతుంది. ముఖ్యంగా రివర్స్ స్వింగ్ కోసం ఈ విధానం కీలకంగా మారుతుంది. బంతిని పాతబడేలా చేసేందుకు పేసర్లు ఎక్కువగా ఉమ్మిని ఉపయోగిస్తారు.
ఈ నిర్ణయం బౌలర్లకు మరింత ఉపయోగపడనుంది. ఇప్పటికే భారత పేసర్ మహ్మద్ షమీ, న్యూజిలాండ్ ఫాస్ట్ బౌలర్ టిమ్ సౌథీ సహా అనేక మంది బౌలర్లు బంతిపై ఉమ్మి రాయడానికి అనుమతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఐపీఎల్లో ఈ నిషేధాన్ని తొలగించిన బీసీసీఐ, ఇకపై ఐసీసీ కూడా ఈ రూల్పై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి.సలైవా నిషేధాన్ని పూర్తిగా ఎత్తివేయడం ద్వారా బౌలింగ్ను మరింత ప్రభావవంతంగా మార్చే అవకాశం ఉంది. ముఖ్యంగా పేసర్లు దీనివల్ల ఎక్కువగా లాభపడతారు. మరి అంతర్జాతీయ క్రికెట్లో ఈ మార్పు కొనసాగుతుందా? లేక ఐపీఎల్కు మాత్రమే పరిమితం అవుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.