బిసిసిఐ కాంట్రాక్టు జాబితాలో రోహిత్, విరాట్ టాప్ గ్రేడ్లో
న్యూఢిల్లీ: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బిసిసిఐ) 2025 సంవత్సరానికి గాను జాతీయ జట్టుకు చెందిన క్రికెటర్ల వార్షిక కాంట్రాక్టు జాబితాను తాజాగా విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం 34 మంది క్రికెటర్లకు స్థానం లభించింది. ఇందులో టాప్ గ్రేడ్ అయిన ఎ ప్లస్ కేటగిరీలో భారత జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ, స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లి, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, స్పీడ్స్టర్ జస్ప్రీత్ బుమ్రాలు చోటు దక్కించుకున్నారు. ఈ గ్రేడ్కు వార్షికంగా రూ.7 కోట్లు రెటైనర్ ఫీజుగా చెల్లించనున్నారు.ఇక ఇటీవల ఛాంపియన్స్ ట్రోఫీలో మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్న మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ శ్రేయస్ అయ్యర్ ఈసారి మళ్లీ కాంట్రాక్టు జాబితాలోకి వచ్చాడు. అయితే అతనిని గ్రూప్ బీ కేటగిరీలో ఉంచారు, దీనికి వార్షికంగా రూ.3 కోట్లు చెల్లించనున్నారు. గత ఏడాది దేశవాళీ క్రికెట్కు దూరంగా ఉండటంతో బిసిసిఐ అతనిని కాంట్రాక్టు జాబితా నుండి తొలగించింది. కానీ ఈ ఏడాది ఐపిఎల్తో పాటు ఇతర ఫార్మాట్లలో మంచి ప్రదర్శన ఇచ్చిన నేపథ్యంలో ఆయనకు మళ్లీ అవకాశం కల్పించారు.
మరోవైపు ముంబయికి చెందిన యువ బ్యాట్స్మన్ ఇషాన్ కిషన్ కూడా గతేడాది కాంట్రాక్టు జాబితా నుంచి తప్పించబడ్డాడు. అయితే ఈసారి గ్రూప్ సీ కేటగిరీలో చోటు దక్కించుకున్నాడు. ఈ గ్రూపులో ఉన్న క్రికెటర్లకు వార్షికంగా రూ.1 కోటి చెల్లించనున్నారు.ఇక రిషబ్ పంత్ విషయానికి వస్తే, గతేడాది గ్రూప్ ఏలో ఉన్నప్పటికీ ఈసారి అదే స్థాయిని కొనసాగించగలిగాడు. టెస్ట్ స్పెషలిస్ట్ అయిన ఆర్. అశ్విన్ రిటైర్మెంట్ తర్వాత అతని స్థానాన్ని పంత్ భర్తీ చేసినట్లు సమాచారం.ఈసారి విడుదలైన బిసిసిఐ కాంట్రాక్టు జాబితా ఆటగాళ్ల ప్రదర్శన, నిబద్ధత, దేశవాళీ మ్యాచ్లలో భాగస్వామ్యం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని రూపొందించబడినట్లు తెలుస్తోంది.
Read More : CSK : సిఎస్ కె పై సంచలన వ్యాఖ్యలు చేసిన అంబటి రాయుడు