ఎస్ఎల్బీసీ (SLBC) టన్నెల్ ప్రమాదం 50 రోజులు గడుస్తున్నా, ఆరుగురు కార్మికుల ఆచూకీ ఇంకా తెలియకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు ఇద్దరి మృతదేహాలు మాత్రమే వెలికితీయబడ్డాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నప్పటికీ, సాంకేతిక సవాళ్లు, భౌగోళిక పరిస్థితులు, మరియు వాతావరణ సమస్యలు ఈ ఆపరేషన్ను ప్రతికూలంగా ప్రభావితం చేస్తున్నాయి.

టన్నెల్లో ఫిబ్రవరి 22న జరిగిన ప్రమాదంలో 8 మంది కార్మికులు చిక్కుకుపోయారు. టన్నెల్లో విధులు నిర్వహించడానికి కార్మికులు, ఇంజినీర్లు, మిషన్ ఆపరేటర్లు 50 మంది లోపలికి వెళ్లగా ప్రమాదం జరిగిన వెంటనే అతి కష్టం మీద 42 మంది ప్రాణాలతో బయటపడ్డారు. మిగిలిన ఎనిమిది మంది లోపల చిక్కుకుపోయారు. ఘటన జరిగిన గంటల వ్యవధిలోని సహాయక చర్యలు మొదలయ్యాయి. మార్చి 9న పంజాబ్కు చెందిన మిషన్ ఆపరేటర్ గురుప్రీత్ సింగ్, మార్చి 25న యూపీకి చెందిన కంపెనీ ఇంజినీర్ మనోజ్ కుమార్ మృతదేహాలను వెలికి తీశారు.
సహాయక చర్యల పురోగతి
SLBC టన్నెల్లో సహాయక చర్యలు మూడు షిఫ్టుల్లో నిరంతరాయంగా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం, టన్నెల్లో 173 మీటర్ల మేర శిథిలాలను తొలగించారు. మిగిలిన 80 మీటర్ల దూరం కీలకంగా మారింది, ఎందుకంటే అక్కడే మిగిలిన ఆరుగురి ఆచూకీ లభించే అవకాశం ఉందని సహాయక బృందాలు భావిస్తున్నాయి. ప్రభుత్వం ప్రత్యేక అధికారి శివశంకర్ను నియమించి, సహాయక చర్యలను పర్యవేక్షిస్తోంది. ప్రభుత్వం సహాయక చర్యలను వేగవంతం చేయడానికి కన్వేయర్ బెల్ట్ పొడిగింపు, అధిక సామర్థ్యం గల పంపుల ద్వారా నీటి తొలగింపు వంటి చర్యలు చేపట్టింది. టన్నెల్లో మట్టి, బురద, మరియు నీటి పేరుకుపోవడం సహాయక చర్యలకు ప్రధాన అడ్డంకిగా మారింది. టన్నెల్ బోరింగ్ మిషన్ (TBM) రెండు వైపులా పూర్తిగా మట్టి, బురదతో నిండిపోయింది. సహాయక బృందాలు TBM ముందు వైపునకు చేరుకున్నప్పటికీ, నీరు, మట్టి, బురదతో చిక్కుకున్న వారిని బయటకు తీయలేని పరిస్థితి ఉంది.
ప్రభుత్వం చర్యలు
ప్రభుత్వం SLBC టన్నెల్ సహాయక చర్యలను నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించి, సహాయక చర్యల నిరంతర పర్యవేక్షణకు ఒక సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించారు. టన్నెల్లో ప్రమాదం జరిగిన ఫేస్ భాగం నుంచి 43 మీటర్ల దూరంలో డీ1 పాయింట్గా అక్కడి నుంచి 20 మీటర్ల దూరంలో డీ2 పాయింట్గా నిర్ధారించారు. అక్కడ ఏర్పాటు చేసిన సిమెంట్ సెగ్మెంట్లలో ఒకటి ఊడి కిందపడగా మరొకటి వంగిపోయింది. దాంతో అక్కడ పైనుంచి నీటి ఊట వస్తోంది. సిమెంట్ సెగ్మెంట్ లేని ప్రాంతంలో మట్టి, రాళ్లు ఊడిపడే ప్రమాదం ఉండడంతో దానిని నో ఆపరేషన్ జోన్గా ప్రకటించారు. ఆ ప్రాంతం మినహా మిగిలిన ప్రాంతంలో తవ్వకాలు కొనసాగుతున్నాయి. మరోవైపు టన్నెల్లో కన్వేయర్ బెల్ట్ విస్తరణకు కూడా ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. SLBC రెస్క్యూ ఆపరేషన్ కంటిన్యూ చేయాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. SLBC సహాయక చర్యలపై ఇటీవల సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ..ఆచూకీ దొరికే వరకు సహాయక చర్యలు కొనసాగాలన్నారు.
Read also: New DGP of Telangana : తెలంగాణ కొత్త DGP ఎవరు?