ఆంధ్రప్రదేశ్ను కుదిపేసిన లిక్కర్ స్కాం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం (SIT) దూకుడు పెంచింది. ఇప్పటి వరకు మొత్తం 11 మంది నిందితులను విచారించి కీలక ఆధారాలు సేకరించినట్లు సమాచారం. వాటి ఆధారంగా ఛార్జ్ షీట్ సిద్ధం చేసిన సిట్, దాన్ని ఏసీబీ కోర్టులో దాఖలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇప్పటికే విచారణలో పలు ఆర్థిక లావాదేవీలు, బెనామీల పేర్లలో జరిగిన లిక్కర్ ఒప్పందాలు వెలుగు చూసినట్లు సమాచారం.
చార్జ్ షీట్ దాఖలు దశలోకి.. రేపే కోర్టులో ఫైల్ చేసే అవకాశం
ప్రాధమిక దర్యాప్తు ముగిసిన తర్వాత సిట్ అధికారులు ఛార్జ్ షీట్ను పూర్తిగా తయారు చేశారు. అందులో కేసుకు సంబంధించిన అన్ని ఆధారాలను, నిందితుల పాత్రలను స్పష్టంగా నమోదు చేశారు. ఈ ఛార్జ్ షీట్ను రేపు (జూలై 19) ఏసీబీ ప్రత్యేక కోర్టులో దాఖలు చేసే అవకాశముందని సమాచారం. ఈ దశలో మరికొంతమంది రాజకీయ నాయకులు, అధికారులు పాత్రలపై స్పష్టత వచ్చే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఎంపీ మిథున్ రెడ్డి అరెస్టుకు కోర్టు అడ్డుకట్ట
ఈ కేసులో వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్ రెడ్డి కీలక నిందితులలో ఒకరిగా ఉన్నారని భావించిన సిట్, ఆయనను అరెస్ట్ చేసి విచారించాలని యత్నించింది. అయితే, ఈ ప్రతిపాదనపై ఏసీబీ కోర్టు నో చెప్పింది. ఎంపీ విచారణకు సహకరిస్తున్నారని, ఇప్పట్లో అరెస్ట్ అవసరం లేదని కోర్టు అభిప్రాయపడింది. దీంతో సిట్ పరంగా అరెస్ట్ ప్రక్రియ వెనక్కి వెళ్లింది. అయినప్పటికీ, మిథున్ రెడ్డి పైన ఉన్న ఆరోపణలు కేసులో కీలకంగా మారనున్నట్లు తెలుస్తోంది.
Read Also : Midhun Reddy : మిథున్ రెడ్డి అరెస్టుకు ఏసీబీ కోర్టు నిరాకరణ