Singapore : ప్రపంచంలో ఆర్థిక అనిశ్చితులు నెలకొన్న సమయంలో సింగపూర్లో జరిగిన ఎన్నికల్లో అధికార పీపుల్స్ యాక్షన్ పార్టీ (పీఏపీ) మరోసారి ఘన విజయం సాధించింది. పార్లమెంటు ఎన్నికల్లో ప్రధాని లారెన్స్ వాంగ్ నేతృత్వంలో పీఏపీ భారీ గెలుపును సొంతం చేసుకుంది. ప్రధానిగా మరోసారి ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. సింగపూర్ పార్లమెంటు ఎన్నికల పోలింగ్ ఉదయం 8 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ కొనసాగింది. దాదాపు 26 లక్షల మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ దేశంలో ఓటేయడం తప్పనిసరి. రాత్రి జరిగిన ఓట్ల లెక్కింపులో పీఏపీ తిరుగులేని విజయం సాధించింది. సింగపూర్ పార్లమెంట్లో మొత్తం 98 సీట్లుండగా, 5 చోట్ల ఇప్పటికే పీఏపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. 93 సీట్లలో 82 చోట్ల ఆ పార్టీ విజయం సాధించి మొత్తం 87 సీట్లను గెలుచుకుంది. ప్రతిపక్ష వర్కర్స్ పార్టీ 10 సీట్లలో గెలిచింది. 66 ఏళ్లుగా సింగపూర్లో పీఏపీనే అధికారంలో కొనసాగుతుంది.

Singapore : సింగపూర్ ప్రధానిగా మళ్లీ లారెన్స్ వాంగ్
గత ఏడాది సింగపూర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన లారెన్స్ వాంగ్ (52) తన నేతృత్వంలో జరిగిన తొలిసారి ఎన్నికల్లో పట్టును నిరూపించుకున్నారు. అమెరికాలో శిక్షణ పొందిన ఈ ఆర్థికవేత్త సింగపూర్ ఆర్థిక మంత్రిగా కూడా సేవలందిస్తున్నారు. సింగపూర్ సార్వత్రిక ఎన్నికల్లో బంపర్ మెజారిటీతో విజయం సాధించిన లారెన్స్ వాంగ్కి భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఆయనతో కలిసి పనిచేయడం కొనసాగించాలని, భారత్, సింగపూర్ మధ్య బలమైన, బహుముఖ భాగస్వామ్యాన్ని పంచుకుంటాయని చెప్పారు. 97 పార్లమెంటరీ స్థానాల్లో 87 స్థానాలను గెలుచుకున్న పీఏపీ, సింగపూర్లో తదుపరి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి సిద్ధమైంది.
Read More : Telangana : మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి భూ భారతి – రైతులకు రక్షణ కవచం