గతంలో ఎన్నడూ లేనివిధంగా ఇటీవల కాలంలో చిన్నారులు సైతం గుండెపోటుకు గురై ప్రాణాలు వదులుతున్నారు. 5వ తరగతి విద్యార్థి తరగతి గదిలోనే ప్రాణాలు విడిచిన ఘటనలు ఉన్నాయి. గతంలో 55 సంవత్సరాలు దాటిన వారిలోనే కొంతవరకు ఈ ముప్పు ఉండేది. యువతతో పాటు పిల్లలకూ ఈ ముప్పు పెరిగిపోవడంతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి.
మారుతున్న కాలానికి అనుగుణంగా మానవుల జీవన స్థితి గతుల్లో కూడా స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి. శరీరానికి శ్రమ, వ్యాయామం కలిగించే పనులు దాదాపుగా తగ్గిపోయాయి. ప్రైవేటు పాఠశాలల ప్రభావం ఎక్కువైన తరువాత ఆట మైదానాలు (Playgrounds) కూడా లేకుండా పోయాయి. అప్పట్లో ఉదయాన్నే నడుచుకుంటూనో, పాఠశాల సమయం సమీపిస్తుందన్న భయంతో పరుగులాంటి నడకతో స్కూళ్లకు వెళ్లేవారు. ప్రార్థన సమయం పేరుతో ఉదయాన్నే మైదానంలో నిలబెట్టి చిన్నపాటి వ్యాయామం (exercise) అందించేవారు.
ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే
ఇంట్లో వండిన ఆహారాన్ని మాత్రమే భోజన సమయంలో ఆరగించేవారు. సాయంత్రం స్పోర్ట్స్ కు సంబంధించిన తరగతులు ఉండేవి. అంతేకాకుండా మొత్తం విద్యార్థులను మైదానంలోకి తీసుకువచ్చి సామూహికంగా వ్యాయామం చేయించేవారు. దీనితో విద్యార్థి దశ నుంచే శరీరంలో పటుత్వం పెరిగేది. ప్రస్తుతం ఇంటి నుంచి స్కూలుకు ఆటోలు, కార్లు ఉన్నాయి. అవి లేనివారు వారి తల్లిదండ్రులు స్కూటర్లపై పాఠశాల గుమ్మం వరకు దిగబెడుతున్నారు. మళ్లీ ఇంటికి వచ్చే సమయంలో కూడా ఇదే సౌకర్యం కొనసాగుతోంది. దీనితో పది అడుగులు కూడా వేయాల్సిన అవసరం చిన్నారులకు ఉండటం లేదు.
ఇంటికి వచ్చిన తరువాత ట్యూషన్లు, హోంవర్క్స్ పేరుతో రాత్రి తొమ్మిది గంటల వరకు పుస్తకాలతో యుద్ధం కొనసాగుతోంది. ఈ విధమైన జీనవశైలిలో శరీరానికి ఏమాత్రం వ్యాయామం ఉండటం లేదు. ఇదే పరిస్థితి యువతలోనూ కనిపిస్తోంది. అదే విధంగా ఆహారపు అలవాట్లలో మార్పులు వచ్చాయి. బయట తిండికి బాగా అలవాటు పడ్డారు. దీనికితోడు జంక్ ఫుడ్స్ఎక్కువ అయ్యాయి. చిన్న పిల్లల నుంచే తినే సమయంలో సెల్ఫోన్ అలవాటు చేశారు. ఫోన్లో వీడియోలు చూస్తుంటే తల్లిదండ్రులు పిల్లలకు భోజనం పెట్టే కార్యక్రమం పూర్తి చేస్తున్నారు. దీనితో పిల్లలు తాము ఎంత తింటున్నామన్న దృష్టిని కోల్పోతున్నారు, దీనివల్ల ఊబకాయం సమస్య అదనంగా తోడు అవుతోంది. ప్రాథమిక పాఠశాల నుంచి పిల్లలకు ప్రత్యేకంగా ఫోన్లను కొని ఇచ్చేస్తున్నారు.
రాత్రి పదకొండు గంటల వరకు ఫోన్లు చూస్తూ కాలం గడుపుతున్నారు. ఇటీవల కాలంలో అధిక బరువు ఉన్న విద్యార్థులపై కొన్ని సంస్థలు అధ్యయనం చేశాయి. వారిపైవివిధ వైద్య పరీక్షలు నిర్వహించారు. అదేవిధంగా వారి జీవనశైలిని నిశితంగా పరిశీలించారు. దీనితో సుమారు 85శాతం మంది విద్యార్థులు అనేక రకాలైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించారు. ఎక్కువ మంది విద్యార్థులకు అధిక రక్తపోటు (హైబీపీ), హై కొలెస్టరాల్, షుగర్ ఉన్నాయనితేలింది. చాలా మందిలో ట్రెగ్లిజరైడ్స్ అధిక మోతాదులో ఉన్నాయి. అంటే రక్తంలో కొవ్వు మోతాదు ఎక్కువగా ఉందని వెల్లడైంది. మరికొందరిలో హోమో సిస్టైన్, లిపో ప్రోటీన్లు ఎక్కువ. మోతాదులో ఉన్నాయి. హోమో సిస్టెన్ అనేది రక్తంలో ఉండే అమైనో యాసిడ్. కొవ్వులను లిపిడ్స్ అంటారు. కొవ్వులను రక్త ప్రవాహం ద్వారా రవాణా చేసే అణువులనులిపో ప్రోటీన్స్ అంటారు. ఇలాంటి విద్యార్థులకు గుండెపోటు ముప్పు అధికంగా ఉన్నట్లు గుర్తించారు.
పిల్లల్లో జీవనశైలిని మార్చడం
పిల్లల్లో జీవనశైలిని మార్చడంతో పాటు వారి ఆహారపు అలవాట్లలో సైతం కొన్ని మార్పులు చేయాల్సిన అవసరం ఉందని వైద్యుల బృందంనిర్ణయించించింది. ముఖ్యంగా అన్ని అనర్థాలకు మూలమైన స్మార్ట్ ఫోన్లు వారికి అందుబాటులో లేకుండా చూడాలి. జంక్ ఫుడ్స్ ను పూర్తిగా నివారించాలి. ఉదయం, సాయంత్రం వేళల్లో వారిని కనీసం రెండు నుంచి నాలుగు కిలోమీటర్లు నడిచేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల ఆరోగ్యం విషయంలో తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. స్మార్ట్ ఫోన్లు, టివిలు కొంత సమయానికి మాత్రమే పరిమితం చేయాలి. పిల్లలు ఇంట్లో ఉన్న సమయంలో తల్లిదండ్రులు కూడా తమ ఫోన్లను పక్కన పెట్టాలి. పిల్లల రోజువారీ శారీరక యాక్టివిటీ క్రమంగా పెంచుకుంటూ రావాలి.
స్కూలులో తరగతి గదికి, ఇంట్లో సెల్ ఫోన్లు అతుక్కుపోయి పిల్లలు గడిపే విధానానికి స్వస్తి పలకాలి. రోజూ కొంత సమయాన్ని గేమ్స్క కేటాయించే స్కూళ్లలో పిల్లలను చేర్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఇంటికి సంబంధించిన తేలికపాటి పనుల్లోనూ పిల్లలను భాగం చేయాలి. తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలి. జంక్ఫుడ్, సాఫ్ట్ డ్రింక్కు దూరం చేయాలి. పిల్లలు స్మార్ట్ఫోన్లో గడిపే సమయాన్ని క్రమంగా తగ్గించి డ్యాన్స్, స్పోర్ట్స్ వంటి ఇతర యాక్టివిటీల్లో గడిపేలా ప్రోత్సహించాలి. అదేవిధంగా పిల్లల నుంచి యువత వరకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వైద్య పరీక్షలు చేయించు కోవాలి. ముఖ్యంగా కొలస్ట్రాల్, గుండె పనితీరు, కిడ్నీలకు సంబంధించిన పరీక్షలు చేయించుకోవాలి. చిన్న వయస్సు లోనే చాలా మందికి షుగర్ సమస్య ఉంటోంది. రక్తకణాల పనితీరుకు సంబంధించిన పరీక్షలు కూడా రెగ్యులర్గా చేయించుకోవాలి. ఇలా ముందు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా గుండెపోటు సమస్యను ఎదుర్కొనే అవకాశం కలుగుతుంది.
Read also: hindi.vaartha.com
Read also: