మనం చేసే పండుగలు, ఉత్సవాలు, కార్యక్రమాలు ప్రజాహితంగాను, పర్యావరణ పరిరక్షణతో కూడుకున్నవి ఉండాలి. దేవుడి పేరుతో పర్యావరణాన్ని దెబ్బతీసే విధంగా ఉంటే ఆ పండుగ లక్ష్యం దెబ్బతింటుంది. ప్రధానంగా గణేష్ చతుర్థి విషయంలో కాలక్రమేణా కొత్త పోకడలు పుట్టుకువచ్చాయి. సామాజిక పండుగగా నిర్వహించే గణేష్ చతుర్థిలో ఎత్తైన విగ్రహాలు ఏర్పాటు చేయడం కొన్ని దశాబ్దాల క్రితం నుంచే ఉంది. కాలనీలు (Colonies), గ్రామాల్లో ప్రజలు సమిష్టిగా ఈ పండుగను నిర్వహించుకోవడం పూర్వ కాలం నుంచీ వస్తోంది. ఇళ్లలో చిన్న చిన్న విగ్రహాలు పెట్టి పూజలు చేసినప్పటికీ కాలనీలు, గ్రామ కూడలిలలో పెట్టే విగ్రహాలు ఆరు నుంచి 60 అడుగుల వరకు ఉంటాయి. విగ్రహం ఎత్తు ఎంతగా ఉన్న మట్టితో తయారు చేసేవారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (పిఓపీ) వచ్చిన తరువాత దీనితో విగ్రహాలు తయారుచేయడం ప్రారంభించారు. అంతే కాకుండా విషతుల్యమైన రంగులు(Colors),ఇతర వస్తువులు కలిపి విగ్రహాలు తయారు అవుతున్నాయి. దీనితో పర్యావరణానికి ఈ పండుగ క్రమంగా దూరం కావడం ప్రారంభించింది. దీనితో పండుగ లక్ష్యం పక్కకు పోయింది.
వెదజల్లే విషతుల్యాలతో వాతావరణ కాలుష్యం
ఈ విగ్రహాల తయారీ సమయంలో వెదజల్లే విషతుల్యాలతో వాతావరణ కాలుష్యం ఏర్పడుతోంది. విగ్రహాలను నీటిలో నిమజ్జనం చేయడం వల్ల నీరు కలుషితంగా మారుతోంది. గతంలో వర్షాకాలంలో ఒక విడత వర్షాలు పడిన తరువాత వచ్చే వినాయక చవితి పండుగ సందర్భంగా చెరువుల్లో పూడిక తీయడానికి అనుకూల వాతావరణం ఉండేది. గ్రామస్థులంతా చెరువు గర్భంలోకి దిగి మట్టిని తీసి విగ్రహాలు తయారు చేసేవారు. దీనితో చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరిగేది. 9 రోజులు, 11 రోజులు పూజలు పూర్తి చేసిన తరువాత విగ్రహాలను తిరిగి అదే చెరువులో నిమజ్జనం చేసేవారు. ఈ సమయంలో వినాయకుడికి చేసిన పత్రి (ఆకులను) కూడా చెరువులో వేసేవారు. ఈ పత్రిలో అనేక ఔషధ విలువలు ఉంటాయి. ఇవి నీటిలో కరిగి ఆరోగ్యవంతంమైన నీటిని ప్రజలకు అందించే అవకాశం కలిగేది. మట్టి గణపతిని ప్రతిష్టిస్తే పర్యావరణానికి మేలు జరగడమే కాకుండా ప్రజలు అంటువ్యాధుల బారిన పడకుండా కాపాడుకునే అవకాశం కలుగుతుంది. మరోపక్క మట్టిని ఉపయోగిస్తే ఆయా చెరువుల నీటి సామర్థ్యం కూడా పెరుగుతుంది. మట్టి కుండలు చేసే జీవించే కుమ్మరి కార్మికులకు ఉపాధి కల్పించినట్లు అవుతుంది.
మార్కెట్లో ఇప్పుడు వినాయకుని ప్రతిమలు తయారు చేసుకోవడానికి అవసరమైన అచ్చులు కూడా అందుబాటులో ఉన్నాయి. వాటి సహాయంతో మనం ఇంట్లోనే బంకమట్టి తెచ్చుకుని వినాయకుని తయారు చేసుకొని, కృత్రిమ రంగులు కాకుండా సహజ రంగులు వాడి వినాయకుని తయారు చేసుకోవచ్చు. సహజమైన రంగులు మనకు కూరగాయలు, పువ్వుల నుంచి వస్తాయి. మట్టి, సహజ ఫైబర్లు, కాగితం వంటి జీవ అధోకరణ పదార్థాలతో తయారు చేయబడతాయి, ఇవి నీటిలో కరిగిపోతాయి. పర్యావరణానికి హాని కలిగించవు.
పర్యావరణ పరిరక్షణ
పర్యావరణ పరిరక్షణ పర్యావరణ అనుకూల విగ్రహాలు పర్యావరణానికి హాని కలిగించే పదార్థాలతో తయారు చేయబడవు, కాబట్టి అవి పర్యావరణాన్ని రక్షించడంలో సహాయపడతాయి. కొన్ని సంస్థలు మట్టి వినాయక విగ్రహంలో విత్తనాలు ఉంచి తయారు చేస్తున్నారు. వీటిని నీటిని నిమజ్జనం చేసిన తరువాత ఆ విత్తనాల నుంచి మొలకెత్తిన మొక్కలు, చెట్టు, వృక్షాలు పర్యావరణాన్ని మరింత కాపాడే అవకాశం కలుగుతుంది. గణపతిని ఇంట్లోనే తయారు చేసుకోవడానికి సృజనాత్మకతతో ఆలోచిస్తే ఎన్నో ఉపాయాలున్నాయి. ఇలా తయారు చేసుకున్న వినాయకుని నిమజ్జనం చేయడం వల్ల చెరువులు, నదులు కలుషితం కావు. పర్యావరణానికి ఎంతో మేలు చేసినట్టవుతుంది.
భగవంతుని పూజలో భక్తి ప్రధానం. భక్తి లేకుండా బంగారు విగ్రహాన్ని పూజించినా ఫలితం ఉండదు. త్రికరణ శుద్ధితో, భక్తి శ్రద్దలతో చిన్న వినాయకుని పూజించినా ఫలితం ఉంటుంది. అంతగానీ ఆర్భాటాలకు, గొప్పలకు పోయి పెద్ద పెద్ద విగ్రహాలను పెట్టి తరువాత వాటిని నిమజ్జనం చేసేటప్పుడు ఎన్నో ఇబ్బందులు పడాల్సి వస్తుంది. పీఓపీతో పెద్ద విగ్రహాల తయారీలో వాడే వస్తువులు నీటిలో కరిగిపోవు. నీటి కాలుష్యానికి కారణమయ్యే అనేక రకాల కృతిమ రంగులు, కెమికల్స్ వీటిలో ఉంటాయి.
వినాయక చవితిని సింపుల్గా చేసుకోవడం వల్ల నష్టమేమీ లేదు. ఎంత భక్తిగా దేవుని పూజిస్తున్నామో ముఖ్యంగానీ, ఎంత ఆడంబరంగా చేస్తున్నామన్నది ముఖ్యం కాదు. మన చుట్టూ ఉండే ప్రకృతే దైవ స్వరూపం. కనిపించే ప్రకృతిని నాశనం చేస్తూ కనబడని దేవుని పూజిస్తే ఎలాంటి ప్రయోజనం లేదు. ప్రకృతిని దైవంగా భావిస్తూ మట్టి గణపతి పూజిద్దాం.
Read also: hindi.vaartha.com
Read also: