ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగుల కోసం సదరం (Sadarem) సర్టిఫికెట్లు జారీ చేసే ప్రక్రియ నేటి (జూలై 3) నుంచి అధికారికంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా దివ్యాంగులు తమ అర్హతను ఆధారంగా చేసుకుని సదరం సర్టిఫికెట్ పొందవచ్చు. ఈ సర్టిఫికెట్ ద్వారా అనేక ప్రభుత్వ సౌకర్యాలు, సంక్షేమ పథకాలలో అర్హత పొందేందుకు వీలు కలుగుతుంది.
సెప్టెంబర్ 30 వరకు అప్లై చేసుకునే అవకాశం
దరఖాస్తు చేసుకునే అవకాశం జూలై 3 నుంచి సెప్టెంబర్ 30 వరకు అందుబాటులో ఉంటుంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సదరం క్యాంపులు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. దివ్యాంగులు ముందుగా స్లాట్ బుకింగ్ చేసుకుని తగిన డాక్యుమెంట్లతో క్యాంపుకు హాజరై పరీక్షలు పూర్తిచేసుకోవాలి. అనంతరం అర్హత ఆధారంగా సర్టిఫికెట్లు మంజూరు చేయనున్నారు.
మీ సేవా కేంద్రాలు లేదా సచివాలయాల ద్వారా బుకింగ్
సదరం స్లాట్లను బుక్ చేసుకోవాలంటే దివ్యాంగులు మీ సేవా కేంద్రాలు లేదా గ్రామ/వార్డు సచివాలయాల ద్వారా నమోదు చేసుకోవచ్చు. ఈ విషయంపై సదరం హెల్త్ నోడల్ అధికారి ఇప్పటికే గ్రామ, వార్డు సచివాలయాల డైరెక్టర్కు అధికారిక లేఖ రాశారు. సంబంధిత అధికారులు ప్రజలకు పూర్తి సహకారం అందించాలన్నదే ప్రభుత్వ ఆదేశం. దివ్యాంగుల హక్కులను కాపాడే ఈ విధానం అమలులో భాగంగా ముందస్తుగా నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read Also : AP Deputy CM : రేపు ప్రకాశం జిల్లాలో పవన్ పర్యటన