Robert Vadra : హరియాణాలో భూ ఒప్పందానికి సంబంధించిన మనీ లాండరింగ్ కేసులో కాంగ్రెస్ ఎంపీ ప్రియాంకా గాంధీ భర్త, వ్యాపారవేత్త రాబర్ట్ వాద్రా మంగళవారం ఢిల్లీలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) విచారణకు హాజరయ్యారు. మనీ లాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద అధికారులు ఆయన స్టేట్మెంట్ రికార్డు చేశారు. దాదాపు 2 గంటలపాటు ప్రశ్నించారు. 56 ఏళ్ల రాబర్ట్ వాద్రా సెంట్రల్ ఢిల్లీలోని సుజన్సింగ్ పార్కు సమీపంలో ఉన్న తన నివాసం నుంచి రెండు కిలోమీటర్ల దూరంలోని ఈడీ ప్రధాన కార్యాలయానికి నడుచుకుంటూ వచ్చారు.

ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు
ఉదయం 11 గంటలకు ఈడీ ఆఫీసులోకి అడుగుపెట్టారు. ఆయన తరఫు లాయర్లు, భద్రతా సిబ్బందిని ఈడీ అధికారులు లోపలికి అనుమతించలేదు. ఈడీ ఆఫీసుకు వెళ్తూ వాద్రా మీడియాతో మాట్లాడారు. ఇది రాజకీయ ప్రేరేపితమైన కేసు తప్ప మరొకటి కాదన్నారు. మైనార్టీల సంక్షేమం కోసం మాట్లాడినప్పుడల్లా తమ నోరు నొక్కడానికి, అణచివేయడానికి కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆరోపించారు. పార్లమెంట్లో మాట్లాడకుండా రాహుల్ని సైతం అడ్డుకుంటున్నారని ధ్వజమెత్తారు.
మనీలాండరింగ్ ఆరోపణలు
కాగా, వాద్రా కంపెనీ 2008 ఫిబ్రవరిలో గుర్గావ్లోని షికోపూర్లో 3.5 ఎకరాల స్థలాన్ని ఓంకారేశ్వర్ ప్రాపర్టీ నుంచి కొనుగోలు చేసింది. దీని విలువ రూ.7.5 కోట్లు. ఆ తర్వాత వాద్రా కంపెనీ ఆ భూమిని రియల్ ఎస్టేట్ కంపెనీ అయిన డీఎల్ఎఫ్కు రూ.58 కోట్లకు విక్రయించింది. డీఎల్ఎఫ్కు రూ.58 కోట్ల భారీ లాభంతో విక్రయించడంతో మనీలాండరింగ్ ఆరోపణలు వచ్చాయి. ఈనేపథ్యంలో ఈడీ విచారణ జరుపుతోంది.
Read Also: ‘సురానా’ కంపెనీలపై ఈడీ దాడులు