హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్సీయూ)లో విద్యార్థుల ఆందోళనలు, ర్యాలీలు, అరెస్టులతో గత కొన్ని రోజులుగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. వివాదాస్పద భూవిషయంలో విద్యార్థులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు.విద్యార్థులు చెబుతున్న ప్రకారం, యూనివర్సిటీ భూసంపదను రాష్ట్ర ప్రభుత్వం ఐటీ అభివృద్ధి పేరుతో ప్రైవేటు సంస్థలకు విక్రయించాలని చూస్తోందని ఆరోపిస్తున్నారు. అయితే, ప్రభుత్వం మాత్రం ఈ భూములు తమ పరిధిలోకి వస్తాయని స్పష్టం చేసింది.కంచ గచ్చిబౌలి భూ వివాదంపై జరిగిన అసత్య ప్రచారాలపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కంచె గచ్చిబౌలి భూముల విషయంలో ఏఐ ఆధారంగా తప్పుడు వీడియోలు వైరల్ చేశారని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. ఈ అంశంపై మంత్రులతో సమీక్ష నిర్వహించిన ముఖ్యమంత్రి నిజాలను మార్చే ఫేక్ వీడియోలు ప్రమాదకరమని అభిప్రాయపడ్డారు. ఏఐ ఫేక్ వీడియోలు కరోనా కంటే డేంజర్ అన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో వాస్తవాలు బయటికి రాకముందే అబద్ధాలను వైరల్ చేశారన్నారు. ఈ అంశంలో ఫేక్ కంటెంట్పై విచారణ జరపాలని కోర్టును కోరుతామని తెలిపారు. ఫేక్ వీడియోలు ప్రచారం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.ఫేక్ వీడియోలను అరికట్టేందుకు ఫోరెన్సిక్ టూల్స్ను సిద్ధం చేశామన్నారు సీఎం రేవంత్. ఫేక్ కంటెంట్ భవిష్యత్తులో యుద్ధాలకు బీజం వేస్తుందని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో సైబర్ క్రైమ్ విభాగాన్ని మరింత బలోపేతం చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు.
భూముల కేటాయింపు
1975లో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి 2,324 ఎకరాల భూమిని కేటాయించింది. మొదటగా, అబిడ్స్లో గోల్డెన్ థ్రెషోల్డ్ భవనంలో తరగతులు నిర్వహించగా, ఆ తర్వాత గచ్చిబౌలికి తరలించారు.2003లో, రాష్ట్ర ప్రభుత్వం కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిని ఐఎంజీ అకాడమీ భారత్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి కేటాయించింది. అయితే, నిర్దేశిత సమయంలో ప్రాజెక్ట్ ప్రారంభించకపోవడంతో, 2006లో ప్రభుత్వం భూముల కేటాయింపును రద్దు చేసింది.
సుప్రీంకోర్టు ఆగ్రహం
కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూముల వ్యవహారంలో తెలంగాణ ప్రభుత్వంపై భారత అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు చర్యలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది.సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు తెలంగాణ హైకోర్టు రిజిస్ట్రార్, మధ్యంతర నివేదికను పంపించారు. హైకోర్టు నివేదికను జస్టిస్ గవాయ్ ధర్మాసనం పరిశీలించింది. చట్టాన్ని చేతుల్లోకి ఎలా తీసుకుంటారని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఇది చాలా తీవ్రమైన అంశమని పేర్కొంది.

మొత్తానికి కంచ గచ్చిబౌలి భూవివాదం వ్యవహారాన్ని ఇటు ప్రభుత్వం, అటు కాంగ్రెస్ నాయకత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టు కనిపిస్తోంది. దీంతో ఈ అంశంలో ప్రభుత్వం చర్యలు ఏ విధంగా ఉంటాయన్నది ఆసక్తికరంగా మారింది.