సినీ నటుడు మంచు మోహన్ బాబు, ఆయన కుమారుడు మంచు విష్ణు (Mohan Babu and his son Manchu Vishnu) కు పెద్ద ఊరట లభించింది. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయి (Fee reimbursement due)ల కోసం గతంలో నిర్వహించిన ధర్నాపై రాష్ట్ర ప్రభుత్వం వేసిన కేసును సుప్రీంకోర్టు కొట్టివేసింది.2019 మార్చి 22న, ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో, తిరుపతి జిల్లాలోని తమ విద్యా సంస్థ శ్రీవిద్యానికేతన్ విద్యార్థుల కోసం మోహన్ బాబు, మంచు విష్ణు నిరసన చేపట్టారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మోహన్ బాబు కుమారులు మంచు విష్ణు, మంచు మనోజ్ సహా సంస్థ సిబ్బంది ఈ ర్యాలీలో పాల్గొన్నారు. నిరసన సందర్భంగా ఏపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ నినాదాలు కూడా చేశారు.

పోలీసులు నమోదు చేసిన కేసు
ఆ సమయంలో ఎన్నికల మోడల్ కోడ్ అమల్లో ఉండగా, ఎన్నికల అధికారి హేమలతకు ఫిర్యాదు అందింది. ఆందోళన కారణంగా ట్రాఫిక్ కు అంతరాయం ఏర్పడిందని పోలీసులు తెలిపారు. దీంతో మోహన్ బాబు, మంచు విష్ణుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.మోహన్ బాబు, తనతో పాటు కుమారుడిపై నమోదైన కేసును రద్దు చేయాలని హైకోర్టులో విజ్ఞప్తి చేశారు. కానీ ఏపీ హైకోర్టు వారి అభ్యర్థనను తోసిపుచ్చింది.
సుప్రీంకోర్టు తీర్పు
తరువాత మోహన్ బాబు ఈ ఏడాది మార్చి 3న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్ను పరిశీలించింది. ఎఫ్ఐఆర్, ఛార్జ్షీట్లు కలిపి చదివిన తర్వాత, కేసులో ఉన్న సెక్షన్లు మోహన్ బాబు, విష్ణుకు ఎలా వర్తిస్తాయో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించింది.తద్వారా, చంద్రగిరి పోలీస్స్టేషన్లో 2019 మార్చి 23న నమోదైన కేసును ధర్మాసనం కొట్టివేసింది. మోహన్ బాబు, ఆయన కుమారుడిపై ఉన్న అభియోగాలు సరిపోవని స్పష్టంగా పేర్కొంది.సుప్రీంకోర్టు తీర్పుతో మంచు కుటుంబం అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ నిర్ణయం వారి కోసం పెద్ద విజయంగా భావిస్తున్నారు.
Read Also : Chenab River : పాకిస్థాన్ పై భారత్ కీలక నిర్ణయం : చీనాబ్ నదిపై సావల్కోట్ ప్రాజెక్టు!