దేశంలో నైరుతి రుతుపవనాలు పూర్తిస్థాయిలో విస్తరించడంతో వర్షాలు పలు ప్రాంతాల్లో భారీగా కురుస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ(Telangana), ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రాల్లో రానున్న మూడు రోజులపాటు వర్షాలు కొనసాగనున్నట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ఇప్పటికే పలుచోట్ల వర్షాలు మొదలవగా, కొన్ని ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని హెచ్చరించింది.

అల్పపీడన ప్రభావం, ఉపరితల ఆవర్తనాలు
అరేబియా సముద్రంలో, బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తనాలతో సోమవారం ఏపీలో కూడా వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ మేరకు పలు జిల్లాలకు వర్ష సూచన చేసింది వాతావరణ కేంద్రం.
ఆంధ్రప్రదేశ్కు వర్ష సూచనలు – జిల్లాల వారీగా హెచ్చరికలు
అమరావతి వాతావరణ కేంద్రం ప్రకారం, సోమవారం శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండగా మిగతా జిల్లాల్లో చెదురుమదురుగా తేలికపాటి వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం చెప్పింది.
తెలంగాణలో వర్షాల ముప్పు – అన్ని జిల్లాలకు ఎల్లో అలర్ట్
హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసిన నివేదిక ప్రకారం, తెలంగాణలోని అన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలెర్ట్ ఇచ్చింది. ఈరోజు తెలంగాణలోని కొమరం భీం, మంచిర్యాల, నిజామాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, మహబూబాబాద్, వరంగల్, హనమకొండ జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని.. హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రైతులకు, ప్రయాణికులకు హెచ్చరికలు
రోడ్లపై వర్షపు నీటితో ప్రమాదాలు జరగే అవకాశం ఉండటంతో డ్రైవర్లు, ప్రయాణికులు జాగ్రత్త వహించాలి. పిడుగుల ముప్పు ఉన్న నేపథ్యంలో అవసరమైతే మాత్రమే బయటకు వెళ్లాలని, విద్యుత్ పరికరాలను అప్రమత్తంగా వాడాలని అధికారులు సూచిస్తున్నారు.
Read also: HYDRA: మాదాపూర్ సున్నం చెరువు ఆక్రమణలపై హైడ్రా కొరడా