పార్లమెంటులో రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద వ్యాఖ్యలపై మాట్లాడిన లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీసుకువచ్చిన ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని సూత్రప్రాయంగా మంచి ఆలోచనగా అభివర్ణించారు. అయితే, ఇది పూర్తిగా విఫలమైందని తెలిపారు.
“ప్రధానమంత్రి ‘మేక్ ఇన్ ఇండియా’ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టారు. ఇది మంచి ఆలోచన. కానీ, దీని ఫలితాలు మీ ముందే ఉన్నాయి. 2014లో దేశ GDPలో తయారీ రంగం వాటా 15.3% ఉండగా, ప్రస్తుతం ఇది 12.6%కి పడిపోయింది. ఇది గత 60 ఏళ్లలో తయారీ రంగం కనీస స్థాయికి చేరిన పరిస్థితి. నేను ప్రధానమంత్రిని నేరుగా తప్పుపట్టడం లేదు, ఆయన ప్రయత్నించలేదు అని చెప్పడం సరికాదు. కానీ చెప్పాల్సిన విషయం ఏమిటంటే, ప్రధానమంత్రి ప్రయత్నించారు… కానీ విఫలమయ్యారు,” అని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారు.
రాహుల్ గాంధీ మాట్లాడుతూ, “మేక్ ఇన్ ఇండియా విఫలమైంది కాబట్టే, మన దేశం ఉత్పత్తి చేయడం మానేసింది. అందుకే, చైనా దళాలు మన దేశంలో ఉన్నాయని చెప్పగలను” అని వ్యాఖ్యానించారు.

“ప్రతి దేశం ప్రధానంగా రెండు విషయాలను నిర్వహిస్తుంది – వినియోగాన్ని, ఉత్పత్తిని. వినియోగాన్ని నిర్వహించడాన్ని నేడు సర్వీసుల రంగం అని చెబుతాం. ఉత్పత్తి నిర్వహణ అంటే తయారీ రంగం. అయితే, ఉత్పత్తి అనేది కేవలం తయారీతో మాత్రమే పరిమితం కాదు. మనం, ఒక దేశంగా, ఉత్పత్తిని సరిగ్గా నిర్వహించడంలో విఫలమయ్యాం,” అని రాహుల్ గాంధీ అన్నారు.
“మన దేశంలో చాలా మంచి కంపెనీలు ఉన్నాయి. అవి ఉత్పత్తిని నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నాయి. కానీ, మనం ఏం చేసాం అంటే, తయారీ రంగాన్ని చైనా చేతుల్లో పెట్టేశాం. ఉదాహరణకు, మొబైల్ ఫోన్ మనం భారతదేశంలో తయారు చేస్తున్నామని చెప్పుకుంటున్నాం. కానీ ఇది నిజం కాదు. ఫోన్ అసెంబ్లింగ్ మాత్రమే భారత్లో జరుగుతోంది. దీని అన్ని భాగాలు చైనాలో తయారు అవుతున్నాయి.