‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ వార్షికోత్సవానికి ప్రధాని
న్యూఢిల్లీ: మరోసారి భారత ప్రధాని నరేంద్రమోడీ రష్యా పర్యటనకు వెళ్లనున్నట్లు తెలుస్తుంది. అక్కడ జరగనున్న “గ్రేట్ పేట్రియాటిక్ వార్” 80వ వార్షికోత్సవ పరేడ్లో ఆయన పాల్గొనే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈవిషయాన్ని అక్కడి వార్తా సంస్థ టాస్ వెల్లడించింది. మే 9న మాస్కోలోని రెడ్ స్క్వేర్ వద్ద ‘గ్రేట్ పేట్రియాటిక్ వార్’ 80వ వార్షికోత్సవం జరగనుంది. ఈ కార్యక్రమానికి మోడీ హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.

ఈ పరేడ్కు రానున్నవివిధ దేశాల అధినేతలు
భారత సైనికదళం సైతం కవాతు నిర్వహించనున్నట్లు సమాచారం. అయితే, దీనిపై విదేశాంగ శాఖ ఏ ప్రకటన చేయలేదు. ఇక, ఈ పరేడ్కు వివిధ దేశాల అధినేతలను ఆహ్వానిస్తున్నట్లు క్రెమ్లిన్ అధికార ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ పేర్కొన్నారు. కాగా, గతేడాది అక్టోబరులో మోడీ రష్యాలో పర్యటించారు. కజన్ వేదికగా జరిగిన 16వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు లో ఆయన పాల్గొన్నారు. ఆ దేశాధ్యక్షుడు పుతిన్ , చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ సహా పలువురు దేశాధినేతలతో మోడీ చర్చలు జరిపారు.
వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలు
బ్రిక్స్ సదస్సులో ప్రసంగించిన మోదీ.. దౌత్యం, చర్చలకు భారత్ మద్దతిస్తుందని, యుద్ధానికి కాదని పునరుద్ఘాటించారు. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పశ్చిమాసియాలో కల్లోల పరిస్థితులు, ఆర్థిక అస్థిరత, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి పలు సమస్యలపై ఆందోళన వ్యక్తంచేశారు. మరోవైపు.. రష్యా- ఉక్రెయిన్ల మధ్య యుద్ధం మొదలై మూడేళ్లు పూర్తయ్యింది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల మధ్య శాంతి నెలకొల్పేందుకు అమెరికాతో సహా పలు దేశాలు కృషి చేస్తున్నాయి. ఈక్రమంలో మోడీ మాస్కోలో పర్యటనకు వెళ్లడం గమనార్హం.