గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ (Ahmedabad) లో ఘోర విమాన ప్రమాదం చోటుచేసుకుంది. గురువారం మధ్యాహ్నం ఎయిర్ ఇండియాకు చెందిన బోయింగ్ 787 డ్రీమ్లైనర్ విమానం AI-171, సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి మధ్యాహ్నం 1:39 గంటలకు లండన్ గ్యాట్విక్కు బయలుదేరింది. అయితే టేకాఫ్ అయిన కేవలం ఐదు నిమిషాల వ్యవధిలోనే విమానం మేఘనీనగర్ సమీపంలోని జనావాసాలపై కుప్పకూలింది.

ప్రాణాపాయకర ఘటన, ఘటనా స్థలంలో సహాయక చర్యలు
విమాన ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే ఎన్డీఆర్ఎఫ్, అగ్నిమాపక సిబ్బంది, వైద్య సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. విమానం కూలిపోతున్న దృశ్యాలు కొన్ని ఆన్లైన్లో వైరల్ అవుతున్నాయి. అవి చూపరులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నాయి.
ప్రయాణికుల వివరాలు, ఎయిర్ ఇండియా ప్రకటన
ఈ ప్రమాదానికి సంబంధించి ఎయిర్ ఇండియా అధికారిక ప్రకటన విడుదల చేసింది. “ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నారు. వీరిలో 169 మంది భారతీయ పౌరులు, 53 మంది బ్రిటిష్ పౌరులు, ఏడుగురు పోర్చుగీస్ జాతీయులు, ఒక కెనడియన్ జాతీయుడు ఉన్నారు” అని ఎయిర్ ఇండియా తెలిపింది. “గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలిస్తున్నాం” అని పేర్కొంది.
ప్రయాణికుల బంధువులు, కుటుంబ సభ్యుల సమాచారం కోసం ప్రత్యేకంగా ఒక హాట్లైన్ నంబర్ను కూడా ఏర్పాటు చేసినట్లు ఎయిర్ ఇండియా వెల్లడించింది. “మరింత సమాచారం అందించేందుకు 1800 5691 444 అనే ప్రత్యేక ప్యాసింజర్ హాట్లైన్ నంబర్ను ఏర్పాటు చేశాము,” అని పూర్తిస్థాయి సేవలందించే ఈ విమానయాన సంస్థ తన ప్రకటనలో జోడించింది.
విమానాశ్రయ సర్వీసుల నిలిపివేత
ఈ ప్రమాదం నేపథ్యంలో అహ్మదాబాద్ విమానాశ్రయం నుంచి ఇతర విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.
ప్రధాని మోదీ, కేంద్ర మంత్రుల స్పందన
ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ, హోం మంత్రి అమిత్ షా, పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రత్యేకంగా స్పందించి సహాయక చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అన్ని సహాయాలు అందిస్తున్నామని మంత్రులు తెలిపారు.
కాగా, ప్రమాదం జరిగిన తీరు చూస్తే, విమానంలోని వారు బతికి బయటపడే అవకాశాలు స్వల్పం అని తెలుస్తోంది. ప్రస్తుతం సహాయక చర్యలు ముమ్మరంగా సాగుతున్నాయి.
Read also: Plane Crash: అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై మోదీ ఆరా
Plane crash: ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది : రామ్మోహన్ నాయుడు