గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై (Plane Crash) ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంలో కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, కేంద్ర హోం మంత్రి అమిత్ షా లతో మోదీ ఫోన్లో మాట్లాడి సమగ్ర వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాద స్థితిగతులపై వివరాలు సేకరించడంతో పాటు, సహాయక చర్యలు వేగంగా కొనసాగించాల్సిందిగా మంత్రులను ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తనకు నివేదించాలంటూ ప్రధానమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.

మేఘానినగర్ ప్రాంతంలో ఘోర ప్రమాదం
గురువారం మధ్యాహ్నం సమయంలో అహ్మదాబాద్ సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు నుంచి లండన్కు బయల్దేరిన ఎయిర్ ఇండియాకు చెందిన ఫ్లయిట్ నెంబర్ ఏఐ-171 విమానం మేఘానిలో కుప్పకూలిపోయింది. టేకాఫ్ అయిన నిమిషాల వ్యవధిలోనే సివిల్ ఆసుపత్రి సమీపంలో జనావాసాలపై (Residential Area) కూలిపోయింది.
ప్రమాద సమయంలో 254 మంది విమానంలో
ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే, విమానం కూలుతున్న దృశ్యాలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. సమాచారం అందుకున్న అధికారులు హుటా హుటిన ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదంలో ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదు. ప్రమాద తీవ్రతను బట్టి మృతుల సంఖ్య ఎక్కువగానే ఉంటుందని జాతీయ మీడియా పేర్కొంటోంది.
విస్తృత సహాయక చర్యలు
ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఎన్డీఆర్ఎఫ్, బీఎస్ఎఫ్, స్థానిక రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలను ప్రారంభించాయి. 90 మంది సభ్యులతో కూడిన మూడు ప్రత్యేక బృందాలు ప్రస్తుతం సహాయ చర్యల్లో నిమగ్నమయ్యాయి. ప్రమాద బాధితులను సమీపంలోని ఆసుపత్రులకు తరలించేందుకు 108 అంబులెన్స్లు పనిచేస్తున్నాయి
Read also: Plane crash: ఈ సంఘటన దిగ్భ్రాంతిని కలిగించింది : రామ్మోహన్ నాయుడు