హైదరాబాద్ : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై పై నిప్పులు చెరిగారు.రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కుర్చీకి పునాది వేసింది తానే అని మల్లన్నసంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ ఏడాది కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర వ్యతిరేకతను మూటగట్టుకుంది. ఇందుకు కారణం రేవంత్ రెడ్డినే అని ఆరోపించారు. రేవంత్ విధానాల వల్ల ప్రజలు విసిగిపోతున్నారని మల్లన్న పేర్కొన్నారు.

రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలి
రేవంత్ రెడ్డి పరోక్షంగా బీజేపీ పార్టీకి సపోర్ట్ చేస్తూ కాంగ్రెస్ పార్టీని ఖతంచేస్తున్నాడు. రేవంత్ రెడ్డి సొంత జిల్లా మహబూబ్నగర్ పార్లమెంట్ సీటు, రేవంత్ రెడ్డి సిట్టింగ్ మల్కాజ్గిరి రెండు సీట్లల్లో కావాలని కాంగ్రెస్ పార్టీని ఓడించాడు. ఒక వేళ రేవంత్ రెడ్డి బలంగా ప్రచారం చేసి ఉంటే.. కేంద్రంలో మోడీ ప్రభుత్వం రాకపోయేది అని పేర్కొన్నారు. ఏడాది పాలనలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ఇంత వ్యతిరేకత ఎందుకొచ్చిందో రేవంత్ రెడ్డి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు.
తోటి మంత్రులే ఆయన పేరు మర్చిపోతున్నారు
ఇటీవల జరిగిన టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ ఓటమికి రేవంత్ రెడ్డినే కారణమని ఎమ్మెల్సీ మల్లన్న ఆరోపించారు. టీచర్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ గెలిచిందన్నారు. ఒక పని చేస్తే తరతరాలు మన పేరు గుర్తుండాలి.. రేవంత్ రెడ్డి పని చేస్తే తోటి మంత్రులే ఆయన పేరు మర్చిపోతున్నారు అని తీన్మార్ మల్లన్న విమర్శించారు.రేవంత్ రెడ్డి విలన్ కాబట్టే విలన్ అని అంటున్నారు అని మల్లన్న చెప్పారు. నువ్వు చేసిన కులగణన సర్వే తప్పు అని నేను నిరూపిస్తా, చర్చకు సిద్ధమా..? అని రేవంత్ రెడ్డికి తీన్మార్ మల్లన్న సవాల్ విసిరారు.