India-Pakistan : మరోసారి భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో ఉద్రిక్తతలు మిన్నంటాయి. పాకిస్తాన్ ఆర్మీ కవ్వింపులకు దిగుతూ నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వెంబడి దుశ్చర్యకు పాల్పడుతోంది. శుక్రవారం తెల్లవారుజామున పాక్ సైన్యం అకస్మాత్తుగా కాల్పులు ప్రారంభించింది. దీంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతతో కూడిన పరిస్థితులు నెలకొన్నాయి. పాక్ సైన్యం జరిపిన కాల్పులకు భారత భద్రతా దళాలు సమర్థంగా ప్రతిదాడులు చేశాయి. పాక్ కవ్వింపులను భారత ఆర్మీ ధైర్యంగా ఎదుర్కొంటోంది.

శత్రువు చర్యలకు భారత ఆర్మీ ధీటైన ప్రతిస్పందన
ఇటీవల జరిగిన పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్-పాకిస్తాన్ సంబంధాల్లో ఉద్రిక్తతలు పెరిగాయి. ఈ క్రమంలో పాకిస్తాన్ సైన్యం కాల్పుల విరమణ ఒప్పందాన్ని తుంగలో తొక్కింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో ఉన్న తమ పోస్టుల నుంచే కాల్పులకు తెగబడింది. శుక్రవారం తెల్లవారుజామున ప్రారంభమైన ఈ దుశ్చర్యతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అయితే, శత్రువు చర్యలకు భారత ఆర్మీ ధీటైన ప్రతిస్పందన ఇస్తోంది. పాక్ సైన్యం కాల్పులను సమర్థవంతంగా తిప్పికొడుతూ దేశ భద్రతను కాపాడుతోంది.
ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు
పహల్గామ్ ఉగ్రవాద దాడి జరిగిన మూడు రోజుల తరువాత, పాకిస్తాన్ సైన్యం రాత్రంతా నియంత్రణ రేఖ (ఎల్ఓసి) వెంబడి ఉన్న అనేక పాకిస్తాన్ పోస్టుల నుండి కాల్పులు జరిపినట్లు సమాచారం. ఇటీవలి కాలంలో ఇంత అసాధారణ పరిణామం జరగలేదని వర్గాలు తెలిపాయి. భారత సైన్యం ప్రతిదాడి చేసింది. భారత వైపు నుండి ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. “పాకిస్తాన్ సైన్యం సరిహద్దు వెంబడి చిన్న ఆయుధాలతో కాల్పులు జరిపింది. మా దళాలు స్పందించాయి. ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు” అని ఒక అధికారి తెలిపారు.
అగ్రశ్రేణి ఫైటర్ జెట్స్తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు
భారత్, పాక్ మధ్య ఉద్రిక్తల వేళ ఇండియన్ ఎయిర్ఫోర్స్ సెంట్రల్ సెక్టార్లో ఆపరేషన్ ఆక్రమణ్ పేరుతో భారీ స్థాయి వైమానిక దళ విన్యాసం చేపట్టింది. భారత్కు చెందిన అగ్రశ్రేణి ఫైటర్ జెట్స్తో పాటు రఫేల్ యుద్ధ విమానాలు ఇందులో ఉన్నాయి. భూ ఉపరితలంతో పాటు కొండ ప్రాంతాలలో దాడి చేసేలా డ్రిల్ చేపట్టారు. దీర్ఘ, స్వల్ప శ్రేణి శత్రు స్థావరాలను నిర్వీర్యం చేసేలా పైలట్లు విన్యాసం చేపట్టారు.