తిరుమల (Tirumala) శ్రీవారి దర్శనాన్ని ఇప్పటికీ కలకాలం గుర్తుంచుకుంటారు. అయితే, విదేశాల్లో నివసించే ప్రవాసాంధ్రులకు ఇది అంత సులభంగా సాధ్యపడేది కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. ఇకపై రోజూ 100 వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు ప్రవాసాంధ్రులకు (VIP Break Darshan tickets for expatriates) ప్రత్యేకంగా కేటాయించనున్నారు. ఈ నిర్ణయం సీఎం చంద్రబాబు నాయుడు సూచనతో తీసుకున్నారు.గత ప్రభుత్వం కాలంలో ఈ బ్రేక్ దర్శన కోటాను 50 నుంచి కేవలం 10కి తగ్గించారు. దీంతో విదేశాల నుంచి వచ్చే తెలుగు భక్తులు నిరాశ చెందారు. ఈ విషయాన్ని ఏపీ ఎన్ఆర్టీ (APNRT) సంస్థ అధ్యక్షుడు రవి వేమూరి ఫిబ్రవరిలో సీఎం దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన చంద్రబాబు, కోటాను 100కి పెంచాలని టీటీడీ అధికారులను ఆదేశించారు.

ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
ప్రవాసాంధ్రులు ముందుగా APNRT వెబ్సైట్ లో సభ్యత్వం నమోదు చేసుకోవాలి. ఇది పూర్తిగా ఉచితం. తమ వీసా, వర్క్ పర్మిట్ వంటి డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలి. వెబ్సైట్లో మూడు నెలల ముందు దాకా దర్శన స్లాట్లు కనిపిస్తాయి. అందులో కోరుకున్న తేదీని సెలెక్ట్ చేయవచ్చు.అప్లై చేసిన తరువాత, టీటీడీ అధికారులు అందుబాటులో ఉన్న సీట్ల ఆధారంగా టికెట్లు కేటాయిస్తారు. టికెట్ వచ్చినవారికి, ఏపీ ఎన్ఆర్టీ సంస్థలోని పీఆర్ఓల ద్వారా బ్రేక్ దర్శన సదుపాయం కల్పిస్తారు.
మరిన్ని వివరాలకు ఇవే కాంటాక్ట్ వివరాలు
ప్రవాసాంధ్రులు తమ సందేహాల పరిష్కారం కోసం APNRT వెబ్సైట్ లేదా తాడేపల్లిలోని ఏపీ ఎన్ఆర్టీ జంక్షన్ ద్వారా 0863-2340678 నంబర్కు కాల్ చేయవచ్చు.ప్రవాసాంధ్రులకు ఇది ఎంతో మంచి అవకాశంగా మారింది. ఇకపై తిరుమల శ్రీవారి బ్రేక్ దర్శనం కోసం ఇబ్బందులు పడాల్సిన అవసరం లేదు. దరఖాస్తు చేసుకుని, సమయానికి దర్శనం పొందవచ్చు.
Read Also : Indigo Flight : తిరుపతి – హైదరాబాద్ ఇండిగో ఫ్లైట్కు తప్పిన ప్రమాదం