Police Notices : కేంద్ర హోంశాఖ ఆదేశాలతో పలు రాష్ట్రాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న పాకిస్థానీయులను గుర్తిస్తున్నారు. హైదరాబాద్లో ఉంటున్న నలుగురు పాక్ పౌరులకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. వీరు షార్ట్ టర్మ్ వీసాలతో ఉంటున్నట్లు గుర్తించారు. రేపటిలోగా హైదరాబాద్ విడిచి వెళ్లాలని ఆదేశించారు. హైదరాబాద్లో మొత్తం 213 మంది పాకిస్థానీయులు ఉన్నట్లు గుర్తించారు. అందులో లాంగ్ టర్మ్ వీసాలు ఉన్నవారు 209 మంది ఉన్నారు. అయితే, లాంగ్ టర్మ్ వీసాలు ఉన్న వారికి మాత్రం కేంద్రం మినహాయింపునిచ్చిన విషయం తెలిసిందే.

పాకిస్తానీలను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలి
కాగా, జమ్మూకశ్మీర్ లోని పహల్గాం లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే పాకిస్థాన్కు వ్యతిరేకంగా కఠిన నిర్ణయాలు తీసుకున్న విషయం తెలిసిందే. ఈ మేరకు భారత్ లో ఉన్న పాక్ పౌరులు వెంటనే దేశం విడిచి వెళ్లిపోవాలని భారత విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అదేవిధంగా అన్ని రాష్ట్రాల సీఎంలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రత్యేకంగా ఫోన్ చేసి రాష్ట్రంలో ఉన్న పాకిస్తానీలను వెంటనే గుర్తించి వెనక్కి పంపాలని ఆదేశించారు. అదేవిధంగా వారి కంప్లీట్ డేటాను కేంద్రానికి పంపితే వారి వీసాల రద్దు చేస్తామని పేర్కొన్నారు.