డొనాల్డ్ ట్రంప్ హెచ్చరికలతో పొరుగుదేశాలపై కయ్యానికి కాలు దువ్విన ఇప్పుడు అన్నంత పనిలాగే.. సుంకాల విధానాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. గతంలో పలుమార్లు భారత్ ను టారిఫ్ కింగ్ అంటూ ట్రంప్ విమర్శించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే భారత్ పై సుంకాల కొరడాను ఝులిపిస్తారా అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఈ నేపథ్యంలో భారత్ ఆందోళన చెందుతుందా?.. అని మీడియా అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సమాధానమిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విషయంలో ఎలాంటి ఆందోళన చెందడం లేదని.. భారత్ తయారీ కేంద్రంగా ఉండాలని తాము కోరుకుంటున్నామని కేంద్ర మంత్రి తెలిపారు. సేవల రంగంలో బలంగా ఉన్నామన్నారు. సాఫ్ట్ వేర్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, స్టెమ్ ఆధారిత పరిశోధనల పరంగా భారత్ స్వదేశీ సామర్థ్యాన్ని కలిగి ఉందని.. భారత్ బలాలేంటో మనకు తెలుసన్నారు. భారత్ లో అందుబాటులో లేని ఉత్పత్తులను మనం దిగుమతి చేసుకోవాలని.. వాటిపై అధిక టారిఫ్ విధించి ఇండియాలోకి రాకుండా ఆపడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేదన్నారు. భారత్ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని సమతుల్యత పాటించాల్సిన అవసరం ఉందన్నారు.

అత్యంత అప్రమత్తతతో పరిస్థితులను గమనిస్తున్నాం అని ఆమె అన్నారు. ఇతర దేశాలపై ముఖ్యంగా ప్రపంచ వాణిజ్య డైనమిక్స్లో విధించిన సుంకాల నుంచి పరోక్ష ప్రభావాలు ఉండవచ్చు, భారత్ అప్రమత్తంగా ఉండి తదనుగుణంగా మారుతుందని ఆర్థిక మంత్రి చెప్పారు.
“ఆత్మనిర్భరత”పై భారత్ దృష్టి పెట్టడం వల్ల అమెరికా సుంకాల నుండి ఊహించని సవాళ్ల ప్రభావాన్ని తగ్గించడంలో సహాయపడుతుందని సీతారామన్ పేర్కొన్నారు. ఎగుమతి క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (ECGC), ఎగ్జిమ్ బ్యాంక్ వంటి వాణిజ్య సంస్థలను బలోపేతం చేయడం ద్వారా ఎగుమతి రంగానికి మద్దతు ఇవ్వడానికి ప్రభుత్వం కొనసాగిస్తున్న ప్రయత్నాల గురించి నిర్మలా సీతారామన్ వెల్లడించారు.