Latest News: Supreme Court: వివాహం తర్వాత మహిళ గోత్రం మారుతుంది..వారసత్వ హక్కుపై సుప్రీం తీర్పు

Read Time:  1 min
Supreme Court
Supreme Court
FONT SIZE
GET APP

హిందూ వారసత్వ చట్టం పై సుప్రీం కోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది.వివాహం తర్వాత మహిళ గోత్రం మారుతుందని, కన్యాదానం తర్వాత ఆమె బాగోగుల బాధ్యత భర్త తరపు బంధువులదేనని సుప్రీంకోర్టు పేర్కొంది. హిందూ వారసత్వ చట్టం ప్రకారం..కరోనా సమయంలో మరణించిన ఓ దంపతులకు సంబంధించిన ఆస్తిపై వారి తల్లులు సుప్రీంకోర్టు (Supreme Court) లో దావా వేశారు.

హిందూ వారసత్వ చట్టం 1956లోని సెక్షన్ 15(1)(బి)ని సవాల్ చేస్తూ.. దాఖలైన ఒక పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేసింది.జస్టిస్ బి.వి. నాగరత్న నేతృత్వంలోని ధర్మాసనం ఈ కేసును విచారిస్తూ.. పిటిషనర్ల వాదనలకు ముందు కొన్ని ముఖ్య విషయాలను గుర్తు చేసింది. “ఇది హిందూ వారసత్వ చట్టం. హిందూ అంటే ఏమిటి, హిందూ సమాజం ఎలా నియంత్రించబడుతుంది, దాని అర్థం ఏమిటో దయచేసి గుర్తుంచుకోండి.

‘కన్యాదానం’ జరిగినప్పుడు ఒక మహిళకు గోత్రం మారుతుంది, పేరు మారుతుంది

మీరు ఆ పదాలను ఉపయోగించడానికి ఇష్టపడకపోవచ్చు.. కానీ ‘కన్యాదానం’ జరిగినప్పుడు ఒక మహిళకు గోత్రం మారుతుంది, పేరు మారుతుంది. ఆమె భర్త నుంచి జీవన భృతిని కోరగలదు” అని ధర్మాసనం పేర్కొంది.జస్టిస్ నాగరత్న(Justice Nagaratna) దక్షిణ భారతదేశంలోని కొన్ని సంప్రదాయాలను కూడా ప్రస్తావించారు. “దక్షిణ భారతదేశంలో జరిగే వివాహాలలో.. ఒక గోత్రం నుంచి మరొక గోత్రంలోకి మారుతున్నట్లు ఆచార బద్ధంగా ప్రకటిస్తారు. మీరు ఈ వాస్తవాలన్నింటినీ విస్మరించలేరు” అని ఆమె అన్నారు.

ఒక మహిళ వివాహం చేసుకున్న తర్వాత చట్టం ప్రకారం ఆమె బాధ్యత భర్త, అతని కుటుంబంపై ఉంటుందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆమె తన తల్లిదండ్రుల లేదా తోబుట్టువుల నుంచి జీవన భృతిని కోరలేదని గుర్తు చేసింది. ఒక మహిళ వివాహం చేసుకుంటే.. చట్టం ప్రకారం ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నించింది. అలాగే భర్త, అత్తమామలు, పిల్లలు, భర్త కుటుంబమే ఉంటుందని కోర్టే సమాధానం కూడా చెప్పింది.

Supreme Court
Supreme Court

మహిళకు పిల్లలు లేనట్లయితే.. ఆమె ఎప్పుడైనా వీలునామా రాసుకోవచ్చని

ఆమె తన సోదరుడిపై జీవనభృతి పిటిషన్ (Petition) దాఖలు చేయలేదని కూడా వ్యాఖ్యానించింది. ఒక మహిళకు పిల్లలు లేనట్లయితే.. ఆమె ఎప్పుడైనా వీలునామా రాసుకోవచ్చని జస్టిస్ నాగరత్న తెలిపారు.ఈ చట్టం అన్యాయం, వివక్షతో కూడుకున్నదని సీనియర్ అడ్వకేట్ (Senior Advocate) కపిల్ సిబల్ వాదించారు. “ఒక పురుషుడు వీలునామా లేకుండా మరణిస్తే.. అతని ఆస్తి అతని కుటుంబానికి చెందుతుంది.

మరి ఒక మహిళ పిల్లలు లేనప్పుడు ఆమె ఆస్తి కేవలం ఆమె భర్త కుటుంబానికి మాత్రమే ఎందుకు చెందాలి” అని ఆయన ప్రశ్నించారు. ఈ వాదనపై ధర్మాసనం స్పందిస్తూ.. న్యాయ నిర్ణయాల ద్వారా వేల సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయాలను మార్చడం సరికాదని హెచ్చరించింది. కఠినమైన వాస్తవాలు చెడ్డ చట్టానికి దారితీయకూడదని కోర్టు పేర్కొంది.

America: ట్రంప్ కొత్త చట్టంతో ఆంధ్రా ఆక్వారైతుకు గట్టి దెబ్బే!

సవాల్ కేవలం చట్టపరమైన నిబంధనపై మాత్రమేనని

వేల సంవత్సరాలుగా ఉన్న సంప్రదాయాన్ని మా తీర్పుతో విచ్ఛిన్నం చేయాలని మేము కోరుకోవడం లేదని కోర్టు తెలిపింది.మరో పిటిషనర్ తరపు న్యాయవాది మనేకా గురుస్వామి మాట్లాడుతూ.. తమ సవాల్ కేవలం చట్టపరమైన నిబంధనపై మాత్రమేనని, మతపరమైన ఆచారాలపై కాదని స్పష్టం చేశారు.

వారసత్వ చట్టాలు వివిధ రాష్ట్రాలు, వర్గాల్లో భిన్నంగా ఉంటాయని.. అందుకే వెంటనే ఈ సెక్షన్‌ను రద్దు చేయడానికి కోర్టు వెనుకాడింది.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

Anusha

రచయిత గురించి

Anusha

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.