హోలీ పండుగ భారతీయ సంస్కృతిలో ప్రత్యేకమైన స్థానం కలిగి ఉంది. ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాకుండా, అనేక పురాణ గాథలతో ముడిపడి ఉంది. హోలీ పండుగ శివుడి కామదహనం, హోళికా దహనం, రాధా-కృష్ణుల రంగుల ఆటలు వంటి విశేషాలతో ప్రసిద్ధి చెందింది. ఇది సామాజిక ఐక్యత, ఆనందం, సంప్రదాయాలను వ్యక్తపరిచే పండుగగా నిలుస్తుంది.
హోలీ ప్రత్యేకతలు
ప్రతి పండుగకు ఓ ప్రత్యేకత ఉంటుంది. కొన్ని వ్యవసాయ పనులకు సంబంధిస్తే, మరికొన్ని ఋతువుల మార్పును సూచిస్తాయి. కొన్ని ప్రకృతిని కొలిచే పండుగలైతే, మరికొన్ని కుటుంబ బంధాలను మెరుగుపరిచే పండుగలు. అయితే, హోలీ మాత్రం పూర్తిగా సామాజికమైన పండుగ. ఇందులో ప్రత్యేకమైన పూజల కంటే, రంగులు చల్లుకుంటూ ఆనందాన్ని పంచుకోవడం ముఖ్యంగా భావిస్తారు.
హోలీకి సంబంధించిన పురాణ గాథలు
హోలీ గురించి అనేక పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి.
కామదహనం కథ
తెలుగునాట హోలీ పండుగను “కామదహనం” లేదా “కాముడి పౌర్ణమి” అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం, తారకాసురుడు అనే రాక్షసుడు తన అమితబలంతో రుషులు, ప్రజలను బాధించసాగాడు. అతనికి శివుని సంతానం చేత మాత్రమే మరణం జరుగుతుందనే వరం ఉండటంతో, అతన్ని అడ్డుకోవడం కష్టమయ్యింది.శివుడు దీర్ఘకాలం తపస్సులో ఉండటంతో, పార్వతిని ఆశీర్వదించేందుకు కాముడు తన ప్రేమ బాణాన్ని ప్రయోగించాడు. తపస్సుకు భంగం కలిగిన శివుడు తన మూడో కన్నును తెరిచి కాముడిని భస్మం చేశాడు.ఈ సంఘటనను గుర్తుగా హోలీ పండుగ నాడు కామదహనం నిర్వహిస్తారు. ఇది కోరికలను నియంత్రించాలనే సందేశాన్ని అందిస్తుంది.
హోళికా దహనం కథ
ఈ కథ హిరణ్యకశిపుడు, ప్రహ్లాదుడు, హోళికా చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడు విష్ణుద్వేషిగా ఉండగా, అతని కుమారుడు ప్రహ్లాదుడు పరమవిష్ణుభక్తుడు.హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని మార్చాలని అనేక ప్రయత్నాలు చేసినా, అతని భక్తి కొంచెం కూడా తగ్గలేదు. చివరికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడిని హతమార్చాలని నిర్ణయించుకున్నాడు.హిరణ్యకశిపుని చెల్లెలు హోళికకు “అగ్ని దహింపజాలదు” అనే వరం ఉండేది. ఆమె ప్రహ్లాదుని ఒడిలో కూర్చొని అగ్నిలో కాల్చాలని ప్రయత్నించింది. కానీ, ప్రహ్లాదుడిని విష్ణుమూర్తి రక్షించగా, హోళిక అగ్నిలో భస్మమయ్యింది.ఈ సంఘటనను గుర్తుగా హోలీకి ముందురోజు హోళికా దహనం నిర్వహిస్తారు.
రాధా-కృష్ణుల రంగుల ఆట కథ
శ్రీకృష్ణుడు చిన్నప్పుడు నల్లగా ఉండేవాడు. కానీ రాధాదేవి తెల్లని చాయతో ఉండేది. కృష్ణుడు తన తల్లి యశోదను దీనిపై ప్రశ్నించగా,దీనికి యశోదమ్మ ఏ రంగులోకైనా నువ్వు నీ స్నేహితులతో కలిసి రంగులు చల్లుకోవచ్చు అని చెప్పింది.దీంతో కృష్ణుడు గోపికలపై రంగులు చల్లడం ప్రారంభించాడు. అప్పటి నుంచి హోలీ పండుగను రంగుల ఆటగా జరుపుకోవడం ఆనవాయితీగా మారింది.ఉత్తర భారతదేశంలోని మధుర, బృందావన్, వారణాసి, ప్రయాగరాజ్ ప్రాంతాల్లో హోలీ పండుగను అత్యంత ఘనంగా నిర్వహిస్తారు.
ఆనందం, ఐక్యతకు ప్రతీక
హోలీ కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు ఇది భారతీయ సంస్కృతిలో ఐక్యత, ఆనందాన్ని పెంచే పండుగ. భారతదేశంలో భోగి, సంక్రాంతి, హోలీ లాంటి పండుగలు ప్రకృతికి, మానవ సంబంధాలకు ప్రాముఖ్యతను ఇచ్చేలా రూపొందాయి.ఈ పండుగ సందర్భంగా రంగులు చల్లుకోవడం, పాటలు పాడడం, డ్యాన్స్ చేయడం, బంధువులతో కలసి ఆనందంగా గడపడం ఆనవాయితీగా మారింది. హోలీ రోజు పాత విభేదాలను మరిచి కొత్తగా స్నేహాన్ని ప్రారంభించడానికి మంచి అవకాశం.