గుజరాత్లోని అహ్మదాబాద్లో ఓ ఆలయాన్ని కూల్చివేయడాన్ని నిరసిస్తూ పూజారి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది. డెవలప్మెంట్ పేరుతో ఆలయాన్ని తొలగించాలనే ప్రయత్నం జరుగుతోందని ఆరోపిస్తూ, గుడి కూల్చివేతను అడ్డుకోవాలని తన కొడుకుకు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
మహేంద్ర మినేకర్
అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని కుబేర్ నగర్ సంతోషి నగర్ ప్రాంతంలో ఒక పాత ఆలయం ఉంది. ఈ ఆలయంలో మహేంద్ర మినేకర్ అనే వ్యక్తి పూజారిగా పనిచేస్తున్నారు.1972లో సంతోషినగర్ ఏరియా అభివృద్ధిలో అంతంతమాత్రంగానే ఉన్న సమయంలో మహేంద్ర మినేకర్ తండ్రి ఈ గుడిని కట్టించారు. ఆలయ నిర్మాణం పూర్తయిన తర్వాత ఆ ఏరియా బాగా డెవలప్ అయ్యింది.అయితే, ప్రస్తుతం ఈ ఆలయ స్థలంపై కన్నేసిన కొంతమంది రియల్టర్లు దానిని కూల్చేసేందుకు ప్రయత్నిస్తున్నారని మహేంద్ర మినేకర్ కుటుంబం ఆరోపిస్తోంది. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు కూడా బిల్డర్లకే వత్తాసు పలుకుతున్నారు.ప్రభుత్వ అధికారులు, రియల్ ఎస్టేట్ మాఫియా కలిసి తన తండ్రిని మానసికంగా వేధించారని, వారి ఒత్తిడిని తట్టుకోలేకనే ఆయన ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపించారు.
బలవన్మరణం
ఈ ఒత్తిళ్లను తట్టుకోలేక ఆదివారం మహేంద్ర మినేకర్ ఆలయ ప్రాంగణంలోనే బలవన్మరణానికి పాల్పడ్డారు. తన చివరి శ్వాసలో కూడా ఆలయాన్ని రక్షించాలనే విజ్ఞప్తి చేశారు. అతను తన కొడుకు బ్రిజేశ్ మినేకర్కు రాసిన సూసైడ్ నోట్లో, గుడిని కాపాడాలని తనకు సూచించారంటూ పేర్కొన్నారు. బ్రిజేశ్ సోషల్ మీడియాలో ఓ వీడియో అప్ లోడ్ చేశారు. కాగా, మహేంద్ర మినేకర్ ఆత్మహత్యకు సంబంధించి బ్రిజేశ్ మినేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని, దర్యాఫ్తు చేపట్టామని పోలీసులు తెలిపారు. బ్రిజేశ్ ఆరోపణలపై సమగ్ర దర్యాఫ్తు జరిపిస్తామని వెల్లడించారు.
కేసు నమోదు
ఈ విషాద ఘటనపై అహ్మదాబాద్ పోలీసులు స్పందించారు. బ్రిజేశ్ మినేకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు తెలిపారు. మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, రియల్ ఎస్టేట్ డెవలపర్లు ఈ వ్యవహారంలో ఎలాంటి పాత్ర పోషించారనే దానిపై సమగ్ర విచారణ చేపడుతున్నామని స్పష్టం చేశారు.మహేంద్ర మినేకర్ మృతిపై స్థానిక ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బ్రిజేష్ గుజరాత్ సమాచార్ డిజిటల్తో మాట్లాడుతూ , “53 ఏళ్ల పురాతన ఆలయానికి నాలుగు సంవత్సరాల క్రితం ఏఎంసి నుండి కూల్చివేత నోటీసు అందింది.నాలుగు సంవత్సరాలుగా, నా తండ్రి ఒత్తిడిని ఎదుర్కొన్నారు.గత కొన్ని నెలలుగా ఆలయ భూమిపై వివాదాలు తలెత్తుతున్నాయని వార్తలు వస్తున్నాయి. భక్తులు కూల్చివేత సంభావ్యతపై ఆందోళన వ్యక్తం చేశారు, కానీ అధికారులు ఆలయాన్ని తొలగించాలని ఒత్తిడి చేస్తూనే ఉన్నారని ఆరోపించారు.