తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా రాణించి, రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విజయ్,తమిళగ వెట్రి కళగం (టీవీకే) (Tamil Vetri Kalagam) అధ్యక్షుడిగా కొత్త ప్రయాణం మొదలుపెట్టిన విషయం తెలిసిందే. ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఆయనకు వై–ప్లస్ కేటగిరీ భద్రతను కేటాయించడం వార్తల్లో నిలిచింది. అయితే ఇంత కట్టుదిట్టమైన భద్రత ఉన్నప్పటికీ, చెన్నైలోని నీలంకరైలో ఉన్న విజయ్ నివాసంలో ఊహించని ఘటన చోటుచేసుకోవడం ఆయన అభిమానుల్లో ఆందోళన కలిగిస్తోంది.
సమాచారం ప్రకారం, ఓ 24 ఏళ్ల యువకుడు విజయ్ (Vijay) ఇంటి లోపలికి చొరబడి, టెర్రస్ ప్రాంతంలో తిరుగుతుండగా భద్రతా సిబ్బంది గుర్తించారు. వెంటనే అప్రమత్తమై అతడిని పట్టుకొని పోలీసులు రావడం వరకు అదుపులో ఉంచారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ యువకుడిని అదుపులోకి తీసుకుని ప్రాథమిక విచారణ జరిపారు. విచారణలో ఆ యువకుడి పేరు అరుణ్ అని, గత నాలుగేళ్లుగా మానసిక సమస్యలతో బాధపడుతున్నాడని తెలిసింది. తర్వాత అతడిని మెరుగైన చికిత్స కోసం ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు.

ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది
ఈ ఘటనతో విజయ్ అభిమానులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఆయనకు భద్రతను మరింత కట్టుదిట్టం చేయాలని సోషల్ మీడియా వేదికగా కోరుతున్నారు.విజయ్ రాజకీయ రంగ ప్రవేశం (Political entry) నేపథ్యంలో ఆయన భద్రతపై ఆందోళనలు వ్యక్తమవడంతో ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్ర హోం శాఖ ఆయనకు వై-ప్లస్ కేటగిరీ భద్రత (Y-Plus category security)ను మంజూరు చేసింది.
ఈ భద్రతా వ్యవస్థలో భాగంగా మొత్తం 11 మంది సిబ్బంది షిఫ్టుల వారీగా రక్షణ కల్పిస్తారు. వారిలో ఇద్దరు నుంచి నలుగురు కమాండోలతో పాటు పోలీస్ సిబ్బంది కూడా ఉంటారు. ఇంతటి పటిష్ఠమైన భద్రత ఉన్నప్పటికీ, ఓ వ్యక్తి ఇంట్లోకి చొరబడటం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.గతేడాది ‘తమిళగ వెట్రి కళగం’ పేరుతో విజయ్ తన రాజకీయ పార్టీని ప్రకటించిన విషయం తెలిసిందే. రాబోయే 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఆయన ఇప్పటికే స్పష్టం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: