తమిళనాడు రాజకీయాల్లో కొత్త మలుపు తిరిగింది అన్నాడీఎంకే-బీజేపీ మళ్లీ కలసి పని చేయనున్నట్లు ప్రకటించడంతో, ఈ పరిణామంపై టీవీకే అధినేత, నటుడు విజయ్ స్పందించారు. ఈ పొత్తు ఆశ్చర్యం కలిగించలేదని స్పష్టంగా చెప్పారు. ఎందుకంటే, వీళ్లిద్దరూ గతంలోనూ కలిసి పనిచేసిన పార్టీలే అని పేర్కొన్నారు.విజయ్ వ్యాఖ్యల ప్రకారం, ఈసారి పొత్తు వారి అవసరాల వల్లే జరిగింది. తామే తాముగా వచ్చి కలవలేదని, పరిస్థితులు అలా తలెత్తాయని చెప్పకనే చెప్పారు. ఈ పొత్తుపై ప్రజలు నిర్ణయం తీసుకోవాలని సూచించారు. వారికి సరైన గుణపాఠం ప్రజలే చెబుతారన్న నమ్మకాన్ని వ్యక్తపరిచారు.
పోటీ అసలైనది టీవీకే-డీఎంకే మధ్యే
ఇదే సందర్భంలో విజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో అసలైన పోరు అన్నాడీఎంకే-బీజేపీతో కాదని, టీవీకే-డీఎంకే మధ్యే ఉంటుందని స్పష్టం చేశారు. ప్రజల మద్దతు తమవైపేనని ధీమా వ్యక్తం చేశారు. రాజకీయాల్ని సినిమాగా చూపించవద్దంటూ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
డీఎంకే, బీజేపీ ఒక్కటే – విజయ్ ఆరోపణ
విజయ్ మరోసారి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. డీఎంకే, బీజేపీ వేర్వేరు కాదు. వీళ్లు ఒకే నాటకంలో నటిస్తున్న పాత్రధారులే అని ఎద్దేవా చేశారు. ప్రజల కంటితుడుపు కోసం ఒకరిపై మరొకరు మాటల యుద్ధం చేస్తున్నారని ఆరోపించారు.అవినీతి మీద పోరాడుతున్నామని చెప్పే కేంద్రం, తమిళనాడు ప్రభుత్వంపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని విజయ్ ప్రశ్నించారు. నిజంగా అవినీతి పోరాటమే జరిగితే, డీఎంకే ప్రభుత్వంపై ఇప్పటికే విచారణలు ప్రారంభమై ఉండేవని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ వ్యాఖ్యల ద్వారా విజయ్ ప్రజల్లో మరోసారి తన రాజకీయ వైఖరిని బలంగా ఉంచారు.
Read Also : West Bengal : వక్ఫ్ చట్టంపై బెంగాల్లో ఆందోళనలు.. ముగ్గురు మృతి