భారతీయ రైల్వే చరిత్రలో ఒక కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, ఆధునిక సాంకేతికత, సౌకర్యం, వేగం సమ్మిళితంగా ఉన్న ప్రత్యేక రైలు సేవలుగా నిలుస్తున్నాయి. దేశవ్యాప్తంగా బ్రాడ్ గేజ్ విద్యుదీకరణ నెట్వర్క్లో ప్రస్తుతం మొత్తం 144 వందే భారత్ సర్వీసులు నడుస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇది రైల్వే మౌలిక సదుపాయాలను ఆధునికీకరించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ప్రతిబింబిస్తోంది.ఇటీవల రాజ్యసభలో ఒక లిఖితపూర్వక ప్రశ్నకు సమాధానంగా రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (Railway Minister Ashwini Vaishnav) ఈ వివరాలను వెల్లడించారు. అధిక రద్దీ ఉన్న మార్గాల్లో ప్రయాణికులకు వేగవంతమైన, సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతిని అందించడమే ఈ సెమీ-హై-స్పీడ్ రైళ్ల లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.
ప్రయాణికుల ఆదరణ పెరుగుతుంది
వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు ప్రారంభమైనప్పటి నుంచి ప్రయాణికుల నుంచి అద్భుతమైన స్పందన వస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో దాదాపు 3 కోట్ల మంది ఈ రైళ్లలో ప్రయాణించారు. అంతేకాకుండా, ఈ ఏడాది ఏప్రిల్ నుంచి జూన్ మధ్య 93 లక్షల మంది ఈ సేవలను వినియోగించుకున్నారు. ఈ గణాంకాలు వందే భారత్ రైళ్లపై ఉన్న ప్రజాదరణను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.వందే భారత్ రైళ్ల (Vande Bharat trains) లో అత్యాధునిక భద్రతా ఫీచర్గా ‘కవచ్’ యాంటీ-కొలిజన్ సిస్టమ్ను అమర్చారు. వీటితో పాటు ఆటోమేటిక్ డోర్లు, ప్రయాణికులు సులభంగా నడిచేందుకు వీలుగా బోగీల మధ్య పూర్తిగా మూసి ఉండే మార్గాలు, ఎగ్జిక్యూటివ్ క్లాస్లో తిరిగే కుర్చీలు, ప్రతి సీటు వద్ద మొబైల్ ఛార్జింగ్ సాకెట్లు, దివ్యాంగుల కోసం ప్రత్యేక టాయిలెట్లు, సీసీటీవీ నిఘా వంటి అనేక సౌకర్యాలు ఉన్నాయి.

మరో రెండు కొత్త వందే భారత్ సర్వీసులను
ఇదిలా ఉండగా, ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ కర్ణాటకలోని బెంగళూరు-బెళగావి మధ్య కొత్త వందే భారత్ రైలు సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైలు ఎక్కి విద్యార్థులతో ముచ్చటించారు. దీంతో పాటు అమృత్సర్ – శ్రీ మాతా వైష్ణో దేవి కాట్రా, నాగ్పూర్ (అజ్నీ) – పుణె మధ్య మరో రెండు కొత్త వందే భారత్ సర్వీసులను కూడా ఆయన జెండా ఊపి వర్చువల్ గా ప్రారంభించారు. బెంగళూరులో జరిగిన కార్యక్రమానికి కర్ణాటక గవర్నర్ థావర్చంద్ గెహ్లాట్, ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, వి. సోమన్న, ఇతర ప్రముఖులు హాజరయ్యారు.
వందే భారత్ రైలు ఎప్పుడు ప్రారంభమైంది?
మొదటి వందే భారత్ రైలు 15 ఫిబ్రవరి 2019న న్యూ ఢిల్లీ – వారణాసి మార్గంలో ప్రారంభమైంది.
వందే భారత్ రైలు గరిష్ట వేగం ఎంత?
వందే భారత్ రైలు గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.
Read hindi news: hindi.vaartha.com
Read also: