మహారాష్ట్రలోని జల్గావ్ జిల్లాలో నిన్న ఘోర రైలు ప్రమాదం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రమాదంలో 12 మంది ప్రాణాలు కోల్పోగా.. మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. ముంబయికి 400 కిలో మీటర్ల దూరంలో జరిగిన ఈ ప్రమాదంలో.. చనిపోయిన వారి మృతదేహాలు మొత్తం నుజ్జునుజ్జుగా మారాయి. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టగా.. రైల్లో మంటలు చెలరేగాయన్న వదంతుల వల్లే ప్రమాదం సంభవించిందని వివరించారు. కానీ తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం అజిత్ పవార్.. ఈ ప్రమాదానికి అసలైన కారకుడు టీ అమ్ముకునే వ్యక్తి అని తెలిపారు.
ఉత్తర్ప్రదేశ్లోని లక్నో నుంచి మహారాష్ట్రలోని ముంబైకి ప్రయాణిస్తున్న పుష్పక్ ఎక్స్ప్రెస్ రైలులో మంటలు చెలరేగాయని వదంతులు వచ్చాయి. ముఖ్యంగా ఈ మాటలు విన్న పలువురు ప్రయాణికులు భయంతో చైన్ లాగారు. రైలు పూర్తిగా ఆగక ముందే ప్రాణాలు రక్షించుకోవాలనే ఆత్రంతో.. రైలు నుంచి కిందకు దూకారు. అప్పటికే రైలు నడుస్తుండడంతో.. పక్కనున్న పట్టాలపై పడిపోయారు. అయితే వారంతా అక్కడి నుంచి లేచి పక్కకెళ్లోలోపే అటుగా వస్తున్న కర్ణాటక ఎక్స్ప్రెస్ కింద పడి ప్రాణాలు కోల్పోయారు.
అయితే కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసిన పోలీసులకు ఈ ప్రమాదం వెనుక ఉన్న అసలు కారణాలు తెలిశాయి. ముఖ్యంగా రైళ్లో మంటలు చెలరేగుతున్నాయన్న పుకార్లు లేవడంతోనే వారంతా ప్రాణాలు కాపాడుకునేందు రైలు నుంచి దూకి.. ప్రమాదం బారిన పడ్డారని బుధవారం రోజే వెల్లడించారు.
అయితే తాజాగా మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఈ ఘటన వెనుక ఉన్న అసలైన కారకుడి గురించి వివరించారు. రైళ్లో టీ అమ్ముకునే వ్యక్తే ముందుగా.. రైళ్లో ప్రమాదం సంభవించిందని పుకారు సృష్టించాడని తెలిపారు. ఆ వార్తలు విన్న తోటి ప్రయాణికులు.. మంటలు వస్తున్నాయంటూ పెద్ద ఎత్తున కేకలు పెట్టగా.. అందరూ ప్రాణాలు కాపాడుకోవాలని చైన్ లాగి రైలు నుంచి దూకినట్లు స్పష్టం చేశారు.