ఈ సమావేశాల్లోనే జమిలి బిల్లును ప్రవేశపెట్టనున్న కేంద్రం..!

Read Time:  1 min
Jamili Bill
Jamili Bill
FONT SIZE
GET APP

న్యూఢిల్లీ: ప్రస్తుత శీతాకాల సమావేశాల్లో దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా ‘వన్‌ నేషన్‌ వన్‌ ఎలక్షన్‌’ బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టేందుకు కేంద్రం కసరత్తులు చేస్తుంది. అయితే ఈ బిల్లును సభలో ప్రవేశపెట్టిన తర్వాత విస్తృత సంప్రదింపుల కోసం జాయింట్‌ పార్లమెంటరీ కమిటీకి(జేపీసీ) సిఫార్సు చేసే అవకాశం ఉన్నట్టు తెలిపాయి. ఈ బిల్లుపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల స్పీకర్‌లనూ ఆహ్వానించనున్నట్టు సమాచారం. కాగా, జమిలి ఎన్నికల నిర్వహణ సాధ్యాసాధ్యాలపై కేంద్ర ప్రభుత్వం నియమించిన రామ్‌నాథ్‌ కోవింద్‌ కమిటీ ఇప్పటికే నివేదిక సమర్పించిన విషయం తెలిసిందే.

ఈ జమిలి బిల్లు పై ఇటీవలే జరిగిన కేంద్ర కేబినెట్‌లో ఆమోదముద్ర వేసింది. అనంతరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బిల్లుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. దీంతో ఆ దిశగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. జమిలి ఎన్నికలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న వేళ దీనిపై ఏకాభిప్రాయం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక పార్లమెంట్ ఉభయ సభల్లో చర్చించడమే తరువాయి. అయితే జమిలి ఎన్నికలకు సంబంధించి బిల్లు ఆమోదం పొందాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుంది. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ప్రభుత్వానికి పార్లమెంట్‌లో మూడింట రెండు వంతుల మెజార్టీ అవసరం ఉంటుంది. 245 సీట్లు ఉన్న రాజ్యసభలో ఎన్డీఏకి 112 సీట్లు ఉన్నాయి. ప్రతిపక్షానికి 85 సీట్లు ఉన్నాయి. మూడింట రెండు వంతుల మెజార్టీ సాధించడానికి ప్రభుత్వానికి కనీసం 164 సీట్లు అవసరం.

మరోవైపు జమిలి ఎన్నికలను బీఎస్పీ అధినేత్రి మాయావతి స్వాగతిస్తుండగా, ఇండియా కూటమి పార్టీలు మాత్రం జమిలి ఎన్నికలను వ్యతిరేకిస్తున్నాయి. జమిలి బిల్లును ఆమోదించేందుకు బీజేపీకి అంత బలం లేదని, కచ్చితంగా బిల్లు వీగిపోతుందని కాంగ్రెస్ పేర్కొంటోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బిల్లు ప్రవేశపెడితే ఏమి జరుగుతుందనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.