జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) లో పహల్గామ్ సమీపంలో ఏప్రిల్ 22న జరిగిన ఘోర ఉగ్రదాడిలో విచక్షణారహితంగా జరిపిన కాల్పుల్లో 26 మంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. ఈ దాడి అనంతరం దేశవ్యాప్తంగా తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. ఉగ్రవాదుల తాలూకు మూలాలపై దృష్టి పెట్టిన జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విస్తృతంగా దర్యాప్తును ప్రారంభించింది.
లష్కరే తోయిబా అనుబంధ ఉగ్రవాదులకు సహకారం
జమ్మూ కశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి ఘటనపై ఎన్ఐఏ జరుపుతున్న దర్యాప్తులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఆ ఉగ్రదాడిలో పాల్గొన్న ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించిన ఇద్దరు వ్యక్తులను తాజాగా అరెస్ట్ చేశారు. ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన పహల్గామ్లోని బాట్కోట్కు చెందిన పర్వైజ్ అహ్మద్ జోథర్, పహల్గామ్లోని హిల్ పార్క్కు చెందిన బషీర్ అహ్మద్ జోథర్ని అరెస్ట్ చేసి కీలక విషయాలను రాబట్టింది.
చట్టవిరుద్ధ కార్యకలాపాల నిరోధక చట్టం ప్రకారం కేసు
ఈ ఇద్దరిపై చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) చట్టం 1967లోని సెక్షన్ 19 కింద ఇద్దరిని అరెస్టు చేసింది. ఉగ్ర దాడిలో పాల్గొన్న నలుగురు ఉగ్రవాదుల గుర్తింపులను ఇద్దరు నిందితులు వెల్లడించినట్లు సమాచారం. ఉగ్రదాడిలో పాల్గొన్నవారు నిషేధిత ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా (ఎల్ఈటీ)తో అనుబంధంగా ఉన్న పాకిస్తానీ పౌరులని నిందితులు వెల్లడించారు. దాడికి ముందు ఉగ్రవాదులకు పర్వైజ్, బషీర్ హిల్ పార్క్లోని సీజనల్ ధోక్ (గుడిసె)లో ఆశ్రయం కల్పించారు. వారికి ఆహారం, ఆశ్రయం లాజిస్టికల్ మద్దతు సమకూర్చారు.
నలుగురు ఉగ్రవాదులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపి అమాయకుల ప్రాణాలు తీశారు. తర్వాత అడవుల్లోకి పారిపోయారు. అప్పట్నుంచి టెర్రరిస్టుల కోసం వేట కొనసాగుతూనే ఉంది. స్థానికుల సహకారం ఉండి ఉండొచ్చనే కోణంలో కూడా ఎన్ఐఏ దర్యాప్తు కొనసాగించింది. ఈ క్రమంలోనే ఆ నలుగురు ఉగ్రవాదులకు ఆశ్రయమిచ్చిన ఇద్దరిని గుర్తించి ఎన్ఐఏ అదుపులోకి తీసుకుంది.
దేశవ్యాప్తంగా ఆపరేషన్ సిందూర్ ప్రభావం
పహల్గామ్ ఉగ్రదాడికి ప్రతీకార చర్యగా భారత ప్రభుత్వం చేపట్టిన “ఆపరేషన్ సిందూర్” దేశవ్యాప్తంగా మరియు పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లో ఉగ్ర స్థావరాలపై భీకర దాడులకు దారితీసింది. మన దేశంలో ఉంటూ పాక్ కోసం పనిచేసిన ప్రముఖ యూట్యూబర్లను కూడా అదుపులోకి తీసుకున్నారు. కాగా ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత ప్రభుత్వం ఆపరేషన్ సిందూర్ చేపట్టి.. పాకిస్థాన్, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్ర స్థావరాలపై భీకర దాడులు చేసింది. ఆ దాడుల్లో 100 మందికి పైగా ఉగ్రవాదులు మృతి చెందినట్లు ఆర్మీ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాద మూలాలు పూర్తిగా అంతం చేసే వరకు ఆపరేషన్ సిందూర్ ముగియదని కూడా ప్రభుత్వం ప్రకటించింది.
Read also: Chennai: మహిళా ఉద్యోగినిపై డెలివరీ బాయ్ అత్యాచారయత్నం