2025 జూన్ 2: తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా అంగరంగ వైభవంగా వేడుకలు జరుగుతున్నాయి. 2014 జూన్ 2న అధికారికంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం ఈ రోజు 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ సంవత్సరంలోకి అడుగుపెట్టింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు పలువురు ప్రముఖ నాయకులు, రాష్ట్రపతి, ప్రధాని, ముఖ్యమంత్రులు శుభాకాంక్షలు తెలిపారు.
తెలంగాణకు శుభాకాంక్షలు తెలిపిన జాతీయ నాయకులు
రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము హృదయపూర్వక సందేశం
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపదీ ముర్ము సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ, తెలంగాణ అభివృద్ధిపై ప్రశంసలు గుప్పించారు. తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా, సాంకేతికంగా అభివృద్ధి సాధిస్తోందని రాష్ట్రపతి ముర్ము పేర్కొన్నారు. తెలంగాణ ప్రజలు పురోగతిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నా అంటూ ‘ఎక్స్’ (ట్విట్టర్) వేదికగా పోస్టు పెట్టారు.
“రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా తెలంగాణ ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు! ఈ యువ రాష్ట్రం గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని, ఆర్థిక మరియు సాంకేతిక అభివృద్ధి తాలూకు శక్తివంతమైన ఆధునిక పర్యావరణ వ్యవస్థను కలిగి ఉంది. తెలంగాణ ప్రజలు పురోగతి, శ్రేయస్సు మార్గంలో ముందుకు సాగాలని నేను కోరుకుంటున్నాను” అని రాష్ట్రపతి ట్వీట్ చేశారు.
ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసలు
ప్రధాని నరేంద్ర మోదీ కూడా ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపరచడంలో కేంద్రం చేపట్టిన చర్యలను హైలైట్ చేశారు. దేశ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందిందని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధికి ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో చర్యలు చేపట్టినట్లు తెలిపారు. తెలంగాణ ప్రజల మెరుగైన జీవన సౌలభ్యానికి కేంద్రం కృషి చేస్తోందని ఈ సందర్భంగా ప్రధాని పేర్కొన్నారు.
“తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు. జాతీయ పురోగతికి లెక్కలేనంత కృషి చేసేలా తెలంగాణ ప్రసిద్ధి చెందింది. గత దశాబ్దంలో రాష్ట్ర ప్రజల ‘జీవన సౌలభ్యాన్ని’ పెంచడానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. రాష్ట్ర ప్రజలను ఆ దేవుడు విజయం, శ్రేయస్సును ప్రసాదించాలని కోరుకుంటున్నాను” అని మోదీ ట్వీట్ చేశారు.
Read also: Amit Shah : మమతా బెనర్జీపై అమిత్షా ఫైర్