స్వచ్ఛ భారత్ మిషన్ (Swachh Survekshan) కింద నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ 2024-25 అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో మధ్యప్రదేశ్కు చెందిన ఇండోర్ మరోసారి దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా గుర్తింపు పొందింది. ఇది వరుసగా ఎనిమిదోసారి ఇండోర్ ఈ ఘనతను సాధించటం గమనార్హం. శుభ్రత, వ్యర్థ నిర్వహణ, ప్రజల భాగస్వామ్యం వంటి అంశాల్లో అత్యుత్తమ ప్రదర్శన చేయడంతో ఈ పురస్కారాన్ని ఇండోర్ నిలబెట్టుకుంది.
టాప్-5 పరిశుభ్రమైన నగరాల్లో విశాఖ, విజయవాడకు స్థానం
ఇండోర్ తర్వాతి స్థానాల్లో గుజరాత్కి చెందిన సూరత్, మహారాష్ట్రలోని నవీ ముంబై, ఆంధ్రప్రదేశ్కు చెందిన విశాఖపట్నం, విజయవాడ నగరాలు నిలిచాయి. ఈ నగరాలు పట్టణాల్లో శుభ్రత విషయంలో ఎంతో ముందున్నాయని కేంద్రం పేర్కొంది. పరిశుభ్రత కోసం తీసుకున్న వినూత్న చర్యలు, స్మార్ట్ టెక్నాలజీ వినియోగం, ప్రజల అవగాహన పెంపు వంటి అంశాలు నగరాల ప్రదర్శనకు ప్రధాన కారణాలుగా చెప్పొచ్చు.
మధ్యస్థ జనాభా నగరాల్లో నోయిడా ముందు వరుసలో
3 నుంచి 10 లక్షల జనాభా కలిగిన నగరాల విభాగంలో ఉత్తరప్రదేశ్లోని నోయిడా అత్యంత పరిశుభ్రమైన నగరంగా ఎంపికైంది. తర్వాతి స్థానాల్లో చండీగఢ్, మైసూర్ నిలిచాయి. దేశవ్యాప్తంగా పరిశుభ్రతను ప్రోత్సహించేందుకు తీసుకుంటున్న చర్యలకు ఈ అవార్డులు ప్రేరణగా నిలుస్తున్నాయి. విజేతలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా అన్ని నగరాలకు పరిశుభ్రత ప్రాముఖ్యతను గుర్తిస్తూ రాష్ట్రపతి అభినందనలు తెలిపారు.
Read Also ; Amarnath Yatra : అమర్నాథ్ యాత్రకు తాత్కాలిక విరామం