పిల్లల సంక్షేమం పరిపూర్ణంగా కాపాడాలనే లక్ష్యంతో సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. విడిపోయిన దంపతుల మధ్య ఎనిమిదేళ్ల కుమార్తె సంరక్షణ హక్కుపై నడిచిన ఈ కేసులో, తండ్రి ఇంట్లో పౌష్టిక ఆహార లభ్యం లేకపోవడాన్ని ప్రధాన కారణంగా చూపిస్తూ తల్లికి పూర్తి కస్టడీ అప్పగించాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.

సుప్రీంకోర్టు ధర్మాసనంలోని జస్టిస్లు విక్రమ్ నాథ్, సంజయ్ కరోల్, సందీప్ మెహతా ఈ కేసు విచారణలో బాలికతో స్వయంగా మాట్లాడి, ఆమె అభిప్రాయాలు తెలుసుకున్నారు. ఆమె ఆరోగ్యం, భద్రత, వికాసానికి ఏ వాతావరణం మంచిదో విశ్లేషించారు. దీనికి ముందు కేరళ హైకోర్టు బాలిక కస్టడీని నెలకు 15 రోజుల పాటు తండ్రికి ఇవ్వగా, సుప్రీంకోర్టు ఆ ఉత్తర్వులను తిరస్కరించింది.
హోటల్ ఆహారం పిల్లల ఆరోగ్యానికి తగదు
తండ్రి సింగపూర్లో పని చేస్తూ, ప్రతీ రెండు వారాలకు తిరువనంతపురం వచ్చి కుమార్తెతో 15 రోజులు గడిపేవారు. అయితే ఆ సమయంలో బాలికకు ఇంట్లో వండిన భోజనం కాకుండా, ప్రతి రోజూ హోటల్ లేదా రెస్టారెంట్ ఆహారం మాత్రమే అందించారన్న విషయం ధర్మాసనం దృష్టికి వచ్చింది. ఇది చిన్నారుల ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుందని న్యాయస్థానం అభిప్రాయపడింది. ఇంట్లో వండిన ఆహారం మాత్రమే పిల్లల ఆరోగ్య, శారీరక మరియు మానసిక వికాసానికి ఉపకరిస్తుంది, అని జస్టిస్ సందీప్ మెహతా పేర్కొన్నారు. హోటళ్లు, రెస్టారెంట్ల నుంచి తెచ్చిన ఆహారాన్ని నిరంతరం తినడం పెద్దల ఆరోగ్యానికే ముప్పు కలిగిస్తుంది. అలాంటిది ఎనిమిదేళ్ల చిన్నారికి అది ఎంత హానికరం? అని జస్టిస్ సందీప్ మెహతా విచారణ సందర్భంగా వ్యాఖ్యానించారు. బాలిక సంపూర్ణ ఆరోగ్యం, ఎదుగుదల, వికాసానికి ఇంట్లో వండిన పౌష్టికాహారం చాలా అవసరమని, కానీ ఆ పోషణను అందించే స్థితిలో తండ్రి లేరని ధర్మాసనం అభిప్రాయపడింది. తండ్రికి కుమార్తెపై ఎనలేని ప్రేమ ఉన్నప్పటికీ, ఆయన ఇంట్లో ఉన్న వాతావరణం, పరిస్థితులు బాలిక శ్రేయస్సుకు, ఎదుగుదలకు అనుకూలంగా లేవని కోర్టు పేర్కొంది. ముఖ్యంగా, కస్టడీ సమయంలో తండ్రి తప్ప పాపకు తోడుగా మరెవరూ లేకపోవడం కూడా ప్రతికూల అంశంగా మారింది. మరోవైపు, తల్లి తన తల్లిదండ్రులతో కలిసి ఉంటోందని, ఇంటి నుంచే పనిచేస్తోందని, అక్కడ పాపకు అమ్మమ్మ, తాతయ్యలతో పాటు మూడేళ్ల తమ్ముడి తోడు కూడా లభిస్తుందని కోర్టు గమనించింది. ఈ వాతావరణం బాలికకు ఎంతో మేలు చేస్తుందని భావించింది.
చిన్న కుమారుడి సంరక్షణ
మూడేళ్ల కుమారుడి విషయంలో కూడా కేరళ హైకోర్టు నెలకు 15 రోజుల పాటు తండ్రికి అప్పగించిన తీర్పుపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంత చిన్న వయసులో తల్లి నుంచి వేరు చేయడం అతని భావోద్వేగ వికాసానికి హానికరం అని పేర్కొంది. తల్లి వద్ద లభించే భావోద్వేగ, నైతిక మద్దతుతో పోలిస్తే తండ్రి ఇచ్చే తాత్కాలిక మద్దతు చాలా తక్కువని స్పష్టం చేసింది. అక్క తండ్రితో ఉన్నప్పుడు తమ్ముడు కూడా ఆమె తోడును కోల్పోతున్నాడని పేర్కొంది. తుది తీర్పులో, తండ్రి తన కుమార్తెను ప్రతి నెలా ప్రత్యామ్నాయ వారాంతాల్లో కలుసుకోవచ్చని, తన తాత్కాలిక సంరక్షణలోకి తీసుకునేందుకు అనుమతించబడుతారని కోర్టు తెలిపింది. వారానికి రెండు రోజులు వీడియో కాల్ ద్వారా బాలికతో మాట్లాడే అవకాశం కూడా కల్పించింది. అయితే, పూర్తి కస్టడీ మాత్రం తల్లికే ఇచ్చింది. పిల్లల సంక్షేమమే అత్యంత ముఖ్యమని ఈ తీర్పు ద్వారా సర్వోన్నత న్యాయస్థానం మరోసారి స్పష్టం చేసింది.
Read also: India : సరిహద్దుల్లో కాల్పుల కలకలం..గట్టిగా బుద్ధి చెప్పిన భారత్