భారత అంతరిక్ష ప్రయాణంలో మరో గొప్ప ఆవిష్కృతం కానుంది భారత వాయుసేనకు చెందిన గ్రూప్ కెప్టెన్ శుభాన్షు శుక్లా త్వరలో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ISS) వైపు తన తొలి అడుగు వేయనున్నాడు. ఇది కేవలం ఒక సాధారణ యాత్ర కాదండి… ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గగన్యాన్ మిషన్ కు ఇదొక కీలక ముందడుగు అవుతుంది.ఈ విషయాన్ని కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధికారికంగా వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం, “భారతీయ వ్యోమగామితో కూడిన అంతర్జాతీయ అంతరిక్ష ప్రయాణం వచ్చే నెలలో జరగనుంది. ఇది భారత అంతరిక్ష ప్రస్థానానికి మలుపుతిప్పే దశగా నిలవబోతోంది” అన్నారు.

ఆయన మాటల్లో స్పష్టంగా కనిపించిన గర్వం… దేశ ప్రజలలో నూతన ఆశలు రేపుతోంది.శుభాన్షు శుక్లా గత ఎనిమిదినెలలుగా నాసా మరియు ప్రైవేట్ అంతరిక్ష సంస్థ యాక్సియమ్ స్పేస్ వద్ద కఠిన శిక్షణ పొందుతున్నాడు.ఈ శిక్షణతో పాటు స్పేస్ ఫ్లైట్కు కావలసిన అన్ని పరీక్షల్ని కూడా విజయవంతంగా ముగించాడు. ఇప్పుడు Ax-4 మిషన్లో భాగంగా ఆయన ఫాలోన్ 9 రాకెట్ ద్వారా స్పేస్లోకి వెళ్లనున్నాడు.ఈ మిషన్ కోసం భారత ప్రభుత్వం సుమారు 60 మిలియన్ డాలర్లు ఖర్చు చేసినట్టు తెలుస్తోంది. ప్రయోగం ఫ్లోరిడాలోని కెన్నడీ స్పేస్ సెంటర్ నుంచి ప్రారంభం కానుంది. ఈ యాత్రలో నలుగురు సభ్యులు పాల్గొంటున్నారు.
వీరందరూ స్పేస్ఎక్స్ డ్రాగన్ క్యాప్సూల్ ద్వారా ప్రయాణించనున్నారు.ఈ బృందానికి నాసాకు చెందిన మాజీ వ్యోమగామి పెగ్గీ విట్సన్ కమాండర్గా వ్యవహరిస్తుంది.మిగిలిన సభ్యుల్లో పోలాండ్కు చెందిన వ్యోమగామి స్లావోస్జ్ ఉజ్నాన్స్కి, హంగేరీకి చెందిన టిబోర్ కపు ఉన్నారు. 40 ఏళ్ల శుభాన్షు శుక్లా ఈ మిషన్లో పైలట్ పాత్ర పోషించనున్నాడు. ఆయనను ఎంపిక చేయడానికి కారణం – చిన్న వయసులోనే విశేషమైన అనుభవం కలిగిన వ్యక్తిగా ఉండటమే.ఇది కేవలం ఒక స్పేస్ ట్రిప్ మాత్రమే కాదు. 1984లో రాకేష్ శర్మ తర్వాత అంతరిక్షానికి వెళ్లబోయే తొలి భారతీయుడిగా శుభాన్షు నిలవబోతున్నాడు. నాలుగు దశాబ్దాల తర్వాత భారత వ్యోమగామి మళ్లీ అంతరిక్షంలో అడుగుపెట్టనుండటం ఇదే తొలిసారి.గగన్యాన్ మిషన్ కోసం ఇది ఎంతో కీలకమైన పరీక్ష. అంతరిక్షంలో వాస్తవ అనుభవాన్ని సేకరించడం ద్వారా భారత వ్యోమగాముల భవిష్యత్తు ప్రాజెక్టులకు ఈ ప్రయాణం ఉపకరిస్తుంది. ఇస్రో భావన ప్రకారం, శుభాన్షు ప్రయాణం భారత అంతరిక్ష పరిశోధనలకు ఒక సరికొత్త దారిని చూపించబోతోంది.
Read Also : Infosys : రెండేళ్ల తర్వాత ఇన్ఫోసిస్ ట్రైనీలను తొలగింపు