కేంద్ర ప్రభుత్వానికి తాజాగా నియోజకవర్గాల పునర్విభజన అంశం కొత్త తలనొప్పిగా మారింది. ఇప్పటికే దక్షిణాది రాష్ట్రాలు తమకు తగిన నిధులు కేటాయించలేదని కేంద్రంపై ఆగ్రహంగా ఉండగా, ఇప్పుడు నియోజకవర్గాల పునర్విభజన వల్ల నష్టం వాటిల్లుతుందని గళం విప్పుతున్నాయి. జనాభా పెరుగుదల ప్రాతిపదికన ఎంపీ సీట్లు పునర్విభజన జరిపితే, జనాభా నియంత్రణను పాటించిన దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని నాయకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అమిత్ షా భరోసా
ఈ నేపథ్యంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా తమిళనాడులో పర్యటించి, ఈ అంశంపై వివరణ ఇచ్చారు. ఈశా ఫౌండేషన్ నిర్వహించిన శివరాత్రి వేడుకల్లో పాల్గొన్న అనంతరం, బీజేపీ కార్యాలయ ప్రారంభోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, “పునర్విభజన వల్ల దక్షిణాది రాష్ట్రాల్లో ఒక్క లోక్సభ సీటు కూడా తగ్గదు” అని స్పష్టం చేశారు.అమిత్ షా ప్రకటన డీఎంకే, స్టాలిన్ కుటుంబం కేంద్రంపై చేస్తున్న ఆరోపణలకు కౌంటర్గా మారింది. తమిళనాడు సీఎం స్టాలిన్, ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని అమిత్ షా విమర్శించారు. “మోదీ ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం, దక్షిణాది రాష్ట్రాలకు పార్లమెంటు స్థానాల కోత ఉండదు” అని తేల్చి చెప్పారు.
దక్షిణాది రాష్ట్రాలు
తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ నిధుల కేటాయింపులో తమిళనాడుకు అన్యాయం జరిగిందని సీఎం స్టాలిన్ చేస్తున్నఆరోపణలను ఖండించిన అమిత్ షా.2014-24 మధ్య తమిళనాడుకు మోదీ ప్రభుత్వం రూ.5,08,337 కోట్లను ఇచ్చిందని వివరించారు. అంతేకాకుండా తమిళనాడుకు అన్యాయం చేసింది గతంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వమేనని అమిత్ షా మండిపడ్డారు.
తమిళనాడులో అధికారం
తమిళనాడు రాజకీయంగా డీఎంకే ,అన్నాడీఎంకే మధ్య పోటీగా మారిన రాష్ట్రం. కానీ, అమిత్ షా మాట్లాడుతూ “వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో మహారాష్ట్ర, హర్యానా కంటే ముందు తమిళనాడులో బీజేపీ ఘన విజయం సాధించి, అధికారంలోకి వస్తుంది” అని ధీమా వ్యక్తం చేశారు.
అమిత్ షా స్పందన
తమిళనాడులో త్రిభాషా విధానం చుట్టూ రాజకీయ దుమారం రేగుతుండగా, అమిత్ షా “తమిళం అత్యంత ప్రాచీన భాష” అని కొనియాడారు. అయితే, “తాను తమిళంలో మాట్లాడలేకపోతున్నందుకు క్షమించాలి” అని చెప్పారు.నియోజకవర్గాల పునర్విభజన వివాదం కొనసాగుతూనే ఉంది. అయితే, అమిత్ షా స్పష్టమైన హామీ ఇవ్వడం, బీజేపీ దక్షిణాదిలో తమను బలంగా నిలబెట్టేందుకు ప్రయత్నిస్తున్న సంకేతంగా కనిపిస్తోంది. కానీ, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ హామీని నమ్ముతాయా లేదా అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.