భారత పౌరసత్వాన్ని పొందడానికి మూడేళ్లు ముందే, కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పేరును ఓటరు జాబితాలో చేర్చారనే అభియోగాన్ని సోనియా(Sonia) తరఫు న్యాయవాదులు ఖండించారు. 1980లోనే న్యూదిల్లీ పరిధిలో ఓటర్ల జాబితాలో సోనియా పేరును చేర్చారనే ఆరోపణ పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో కూడుకున్నదని దిల్లీ సెషన్స్ కోర్టుకు వారు తెలిపారు. దిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు అడ్వకేట్, సెంట్రల్ దిల్లీ కోర్ట్ బార్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ వికాస్ త్రిపాఠి సోనియాగాంధీపై ఈ ఆరోపణ చేశారు. ఈ మేరకు అభియోగంతో తొలుత 2025 సెప్టెంబరు 11న ఆయన దిల్లీలోని మెజిస్టీరియల్ కోర్టులో క్రిమినల్ ఫిర్యాదు పిటిషన్ వేశారు. అయితే కోర్టు ఆ పిటిషన్ను కొట్టివేసింది. దీంతో ఆయన ఇదే అంశంపై దిల్లీలోని సెషన్స్ కోర్టులో రివిజన్ పిటిషన్ను దాఖలు చేశారు.
Read Also: Epstein Files: బాలీవుడ్ను వణికిస్తున్న ‘ఎప్స్టీన్ ఫైల్స్’
రాజకీయ దురుద్దేశంతో చేసిందే
తాజాగా శనివారం రోజు దిల్లీ సెషన్స్ కోర్టు దీనిపై వాదనలు ఆలకించింది. ఈసందర్భంగా సోనియాగాంధీ తరఫున అడ్వకేట్లు తరణ్నుమ్ చీమా, కన్షికా సింగ్, ఆకాశ్ సింగ్లు కోర్టుకు అఫిడవిట్ను సమర్పించారు. సోనియా భారత పౌరసత్వాన్ని పొందడానికి మూడేళ్లు ముందే (1980లోనే), ఓటర్ల జాబితాలో ఆమె పేరును చేర్చారనే ఆరోపణ కేవలం రాజకీయ దురుద్దేశంతో చేసిందేనని వారు స్పష్టం చేశారు. అదొక నిరాధారమైన, పనికిమాలిన, చట్టాన్ని దుర్వినియోగం చేసే అభియోగమని సోనియా తరఫు న్యాయవాదులు దిల్లీ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి జస్టిస్ విశాల్ గోగ్నేకు తెలిపారు. వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేయాలని కోరారు. దీనిపై తదుపరి విచారణను ఫిబ్రవరి 21వ తేదీకి కోర్టు వాయిదా వేసింది. 1968లో రాజీవ్ గాంధీతో సోనియాగాంధీకి పెళ్లి జరిగింది. 1983 ఏప్రిల్ 30న ఆమెకు భారత పౌరసత్వం లభించింది.
ఎన్నికల సంఘానికే ప్రత్యేక హక్కు
“వికాస్ త్రిపాఠి దాఖలు చేసిన ఈ పిటిషన్ను గతంలో దిల్లీ మెజిస్టీరియల్ కోర్టు తప్పుపట్టింది. పౌరసత్వంతో ముడిపడిన వ్యవహారాలన్నీ కేంద్ర ప్రభుత్వం పరిధిలోకి వస్తాయని ఆ కోర్టు వ్యాఖ్యానించింది. ఓటరు జాబితాకు సంబంధించిన అంశంపై ఎన్నికల సంఘానికే ప్రత్యేక హక్కు ఉంటుంది. దీనిపై ఐపీసీ/బీఎన్ఎస్లోని సెక్షన్ల ముసుగులో వికాస్ త్రిపాఠి లాంటి వ్యక్తులు దాఖలు చేసే ప్రైవేటు పిటిషన్లను క్రిమినల్ కోర్టులు పర్యవేక్షించడం సరికాదు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 329లో ఉన్న అధికారాల వికేంద్రీకరణ సూత్రానికి ఇది పూర్తి విరుద్ధం. ఎన్నికల ప్రక్రియలోకి న్యాయస్థానాల జోక్యాన్ని ఆర్టికల్ 329 నిలువరిస్తుంది” అని సోనియాగాంధీ తరఫు న్యాయవాదులు దిల్లీ సెషన్స్ కోర్టులో వాదన వినిపించారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also Epaper : epaper.vaartha.com
Read Also: