MLAs Disqualification Case: స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ కూర్చోవాలా? సుప్రీంకోర్టు

Read Time:  1 min
Should we just sit and watch even if the Speaker takes no action? Supreme Court
Should we just sit and watch even if the Speaker takes no action? Supreme Court
FONT SIZE
GET APP

MLAs Disqualification Case: తెలంగాణ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపుల కేసు నేడు సుప్రీంకోర్టులో మరోసారి విచారణకు వచ్చింది. ఇదివరకే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేటీఆర్, బీజేపీ నేత మహేశ్వర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్లపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టి వారి తరఫు లాయర్ల వాదనలు విన్నది. నేడు ఏప్రిల్ 2 (బుధవారం) నాడు స్పీకర్ తరపున లాయర్ ముకుల్ రోహత్గి వాదనలు వినిపించారు. స్పీకర్ చర్యలు తీసుకోవాలని సైతం ధర్మాసనం ఆదేశింలేదా, ఫిరాయింపుల అంశంపై స్పీకర్ చర్యలు తీసుకోకున్నా తాము చూస్తూ ఉండిపోవాలా అని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. అసెంబ్లీ కార్యదర్శి తరపున సీనియర్ లాయర్ అభిషేక్ మను సింగ్వీ వాదనలు వినిపించనున్నారు. రేపు (ఏప్రిల్ 3న) ఉదయం 10 గంటలకు ధర్మాసనం సమయం కేటాయించింది.

స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా చూస్తూ

స్పీకర్ కు కోర్టులు చెప్పడం భావ్యం కాదు

నేటి విచారణలో ప్రతివాదులుగా ఉన్న తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేల తరఫు వాదనలు సుప్రీంకోర్టు ధర్మాసనం విన్నది. ఒక రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పులపై మరో రాజ్యాంగ ధర్మాసనం తీర్పులు ఎలా ఇస్తుంది. స్పీకర్ కు రాజ్యాంగం విశేష అవకాశాలు కల్పించింది. వాటిని కోర్టులు హరించకూడదు. స్పీకర్ నిర్ణయం తీసుకున్నాక కోర్టులు దానిపై న్యాయసమీక్ష చేపట్టే అవకాశం ఉంటుంది. కానీ పలానా సమయానికి నిర్ణయం తీసుకోవాలని స్పీకర్ కు కోర్టులు చెప్పడం భావ్యం కాదు. కోర్టులు, ధర్మాసనాలు ఇచ్చే సూచనలు పాటించాలా.. లేదా అనేది విశేష అధికారం స్పీకర్లకు ఉంటుంది అని ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు.

కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటాయి

సకాలంలో ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ కు సూచించలేమా అని జస్టిస్ బీఆర్ గవాయ్ ప్రశ్నించారు. ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేసిన వారం రోజుల్లోనే కోర్టులో పిటిషన్ వేశారని ముకుల్ రోహత్గీ తెలిపారు. స్పీకర్ కు దీనిపై ఆలోచించుకునే సమయం కూడా ఇవ్వకుండా, ఒక పిటిషన్ తరువాత మరో పిటిషన్ వేస్తూ పోయారని సుప్రీంకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. కోర్టులు రాజ్యాంగ పరిరక్షకులుగా ఉంటాయని జస్టియ్ బీఆర్ గవాయ్ అన్నారు. ఇప్పటికే ఏడాది ముగిసింది, మరో నాలుగేళ్లు స్పీకర్ చర్యలు తీసుకోకపోయినా కోర్టులు ఎలాంటి ఆదేశాలు జారీ చేయకూడదా.. ఇలాగే చూస్తూ ఉండిపోవాలా అని ముకుల్ రోహత్గీని ప్రశ్నించారు. పిటిషనర్ల ఇష్టానుసారం అసెంబ్లీ స్పీకర్ నిర్ణయాలు తీసుకోరని, గత ఏడాది మార్చి 18న పిటిషనర్లు స్పీకర్ కు ఫిర్యాదు చేయగా.. ఈ జనవరి 16న ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు జారీ చేశారని ముకుల్ రోహత్గీ అన్నారు.

sumalatha chinthakayala

రచయిత గురించి

sumalatha chinthakayala

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.