యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా (UIDAI) ఆధార్ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. ఆధార్ను ఏటీఎం కార్డు తరహాలో భద్రంగా ఉంచుకునేందుకు వీలుండే PVC (Polyvinyl Chloride) కార్డు ధరలను పెంచుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటివరకు ఈ కార్డు కోసం వినియోగదారులు రూ. 50 చెల్లిస్తుండగా, ఇకపై పన్నులతో (GST) కలిపి రూ. 75 వసూలు చేయనున్నారు. ఈ పెంచిన ధరలు జనవరి 1, 2026 నుంచే అమలులోకి వచ్చినట్లు స్పష్టం చేసింది. సాధారణ కాగితం ఆధార్ కార్డులు త్వరగా పాడైపోతాయనే ఉద్దేశంతో చాలామంది ఈ ప్లాస్టిక్ పీవీసీ కార్డులను ఇష్టపడుతుంటారు.
Deputy CM Bhatti: డిస్కంల కార్మికులకు రూ.1 కోటి ప్రమాద బీమా
ధరల పెంపునకు గల కారణాలను కూడా UIDAI వివరించింది. పీవీసీ కార్డు తయారీకి అయ్యే ముడిసరుకు ఖర్చులు పెరగడంతో పాటు, కార్డుపై భద్రతా ఫీచర్లతో కూడిన ప్రింటింగ్, డెలివరీ మరియు లాజిస్టిక్ (రవాణా) ఖర్చులు పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని తెలిపింది. స్పీడ్ పోస్ట్ ద్వారా నేరుగా ఇంటికే డెలివరీ చేసే ప్రక్రియలో పెరిగిన ఛార్జీల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ సర్దుబాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. కేవలం అధికారిక వెబ్ సైట్ లేదా యాప్ ద్వారా మాత్రమే కాకుండా బయట మార్కెట్లో దొరికే అనధికారిక పీవీసీ కార్డులు చెల్లవని కూడా ఈ సందర్భంగా మరోసారి హెచ్చరించింది.

వినియోగదారులు ఈ కొత్త కార్డు కోసం ‘మైఆధార్’ (myAadhaar) పోర్టల్ లేదా ‘maadhaar’ మొబైల్ యాప్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లై చేసిన తర్వాత రిజిస్టర్డ్ మొబైల్ నంబర్కు వచ్చే ఓటీపీ ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, నిర్దేశించిన రూ. 75 ఫీజును ఆన్లైన్ పేమెంట్ (UPI, డెబిట్/క్రెడిట్ కార్డు) ద్వారా చెల్లించాలి. దరఖాస్తు పూర్తయిన కొన్ని రోజుల్లోనే అత్యాధునిక సెక్యూరిటీ ఫీచర్లయిన హోలోగ్రామ్, ఘోస్ట్ ఇమేజ్, మైక్రో టెక్స్ట్ వంటి వాటితో కూడిన పీవీసీ కార్డు మీ ఇంటి చిరునామాకు చేరుకుంటుంది. ఈ కార్డు వాతావరణ పరిస్థితులకు తట్టుకుని ఎక్కువ కాలం మన్నికగా ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com