పహల్గాం ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రదాడిపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) తన ప్రాథమిక దర్యాప్తులో పలు సంచలన విషయాలను బయటపెట్టింది. ఈ దాడి వెనుక పాకిస్థాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ ప్రమేయం ఉందని ఎన్ఐఏ స్పష్టంచేసింది. దాడికి సంబంధించిన ప్రణాళిక మొత్తం పాకిస్థాన్లోనే రూపుదిద్దుకుందని పేర్కొంది. ఈ దాడిలో పాల్గొన్న హష్మీ ముసా అలియాస్ సులేమన్, అలీ బాయ్లు పాకిస్థాన్కు చెందినవారని వెల్లడించింది. పలువురిని అదుపులోకి తీసుకుని విచారించగా, పలు కీలకమైన అంశాలు వెలుగులోకి వచ్చాయి.
పాక్ ఉగ్రవాదులతో నిరంతర సంబంధాలు
పహల్గాం ఘటన జరగడానికి ముందే ఉగ్రవాదులు భారత్లోకి ప్రవేశించారని ఎన్ఐఏ గుర్తించింది. దాడికి ముందు మరియు సమయంలో పాక్ ఉగ్రవాదులతో వీరు నిరంతరంగా సంభాషణలు నిర్వహించినట్లు తెలిపింది. దాడి ఎక్కడ, ఎప్పుడు జరగాలి అనే విషయాలు కూడా పాక్లోని ఆదేశాల ప్రకారమే అమలయ్యాయని స్పష్టంచేసింది. ఈ ఉగ్రవాదులకు దేశీయంగా కొంతమంది ఆశ్రయం కల్పించడం, ఆయుధాలు సమకూర్చడం వంటి సహాయాలు అందించారని ఎన్ఐఏ వివరించింది. దాడికి సంబంధించి ఫోరెన్సిక్ మరియు ఎలక్ట్రానిక్ డేటా ఆధారంగా పలు ఆధారాలు సేకరించారు.
విశాల దర్యాప్తుతో వెలుగు చూసిన నిజాలు
ఈ దాడిపై ఎన్ఐఏ దాదాపు 2800 మందిని విచారించింది. 150 మందిని కస్టడీలోకి తీసుకుని ప్రశ్నించింది. కుప్వారా, పుల్వామా, అనంతనాగ్, బారాముల్లా వంటి ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. దాడి జరిగిన ప్రదేశంలో 40 క్యాటరిడ్జులు స్వాధీనం చేసుకొని, వాటిపై బాలిస్టిక్ పరీక్షలు నిర్వహించారు. 3డీ మ్యాపింగ్తో పాటు వ్యాలీ మొబైల్ డేటా, శాటిలైట్ ఫోన్ల ట్రాకింగ్ ద్వారా కీలక ఆధారాలు రాబట్టారు. ఈ దర్యాప్తు ఆధారంగా పాకిస్థాన్ హస్తం మరోసారి ముసుగుతొ బయటపడిందని ఎన్ఐఏ స్పష్టం చేసింది.
ఈ దాడికి పాల్పడిన వారిని తుది పరిణామాల వరకు ఎదుర్కొనేందుకు కేంద్ర ప్రభుత్వం, జాతీయ దర్యాప్తు సంస్థ ఎంత దూరమైనా వెళ్తుందన్న సంకేతం ఈ దర్యాప్తు ద్వారా స్పష్టమైంది.