దేశవ్యాప్తంగా రైతులు ఎదురుచూస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి (PM-Kisan Samman Nidhi) పథకం 20వ విడత డబ్బులపై కీలక ప్రకటన రానుంది. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేటి బిహార్ పర్యటన సందర్భంగా ఈ అంశంపై అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం. ప్రస్తుతం లక్షలాది మంది రైతులు తమ బ్యాంకు ఖాతాల్లో మరో రూ.2వేలు పడే తేదీ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
ఏటా రూ.6 వేలు.. మూడు విడతల్లో
పీఎం కిసాన్ పథకం కింద అర్హత కలిగిన రైతులకు సంవత్సరానికి రూ.6వేలు, మూడు విడతలుగా రూ.2వేలు చొప్పున కేంద్ర ప్రభుత్వం నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకి జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ఏడాది ఫిబ్రవరిలో 19వ విడత నగదు జమ కాగా, ఇప్పుడే 20వ విడత ప్రకటించేందుకు కేంద్రం సిద్ధమవుతోంది. ఈ పథకం ద్వారా రైతులకు నెలవారీ ఖర్చులకు కొంత ఊరట కలుగుతోంది.
దాదాపు 9.80 కోట్ల మంది లబ్దిదారులు
ఈ పథకం అమలుతో దేశవ్యాప్తంగా సుమారు 9.80 కోట్ల మంది రైతులు లబ్దిపొందనున్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ మొత్తాన్ని డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ (DBT) ద్వారా వారికి జమ చేస్తుంది. పీఎం కిసాన్ వెబ్సైట్ లేదా మొబైల్ యాప్ ద్వారా రైతులు తమ స్టేటస్ను కూడా చెక్ చేసుకోవచ్చు. తాజాగా జమ కానున్న 20వ విడత డబ్బులు రైతులకు మరింత ఊరటను కలిగించనున్నాయి.
Read Also : AAIB : ఎయిరిండియా ప్రమాదం.. నిరాధార వార్తలపై స్పందించిన ఏఏఐబీ